ఏకంగా పది సార్లు.. 20 ఏళ్లుగా చెరగని మాజీ సీఎం రికార్డు | Kalyan Singh Record: 10 Times Elected as MLA in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

ఏకంగా పది సార్లు.. 20 ఏళ్లుగా చెరగని మాజీ సీఎం రికార్డు

Feb 1 2022 4:41 PM | Updated on Feb 1 2022 5:06 PM

Kalyan Singh Record: 10 Times Elected as MLA in Uttar Pradesh - Sakshi

ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌ సింగ్‌ పదిసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన రికార్డు రెండు దశాబ్దాలుగా చెరగని రికార్డుగా ఉంది.

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద అసెంబ్లీ ఉత్తరప్రదేశ్‌లో ప్రతిసారి ఎన్నికల్లో ‘తొలి’సారి ఎమ్మెల్యేలు అధికంగా ఉంటారు. గడిచిన నాలుగు ఎన్నికలు పరిశీలిస్తే 2017లో అత్యధికంగా మూడింట రెండొంతులు అంటే 403 మందికి 239 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. నాలుగైదు దశాబ్దాల ఎన్నికల్లో తొలి గళం అధికంగా వినిపించింది 2017 నాటి 17వ అసెంబ్లీ ఫలితాల్లోనే. ప్రస్తుత ఎన్నికల్లో అతిపెద్ద మల్లయోధుడు ఆజంఖాన్‌ రాంపూర్‌ నుంచి ఎస్పీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. పదోసారి అసెంబ్లీలో అడుగుపెట్టడానికి ఆజంఖాన్‌ యత్నిస్తున్నారు. తొమ్మిదోసారి అడుగుపెట్టే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారిలో సురేశ్‌కుమార్‌ ఖన్నా(బీజేపీ) షాజహన్‌పూర్‌ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. రామ్‌ గోవింద్‌ చౌదరి కూడా ఎస్పీ తరఫున బల్లియా పోటీకి సిద్ధంగా ఉన్నారు. 

ఇక బీజేపీ, టీఎంసీ, బీఎస్పీల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శ్యామ సుందర్‌ శర్మ ఈసారి బీఎస్పీ నుంచి బరిలో దిగనున్నారు. అఖిలేశ్‌ సర్కారులో మంత్రిగా పనిచేసిన దుర్గా ప్రసాద్‌ యాదవ్‌ కూడా తొమ్మిదోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్‌ మహానా, రాంపాల్‌ వర్మ, రమాపతి శాస్త్రి, జయ ప్రతాప్‌సింగ్‌ (బీజేపీ) ఎనిమిదో సారి గెలుపుకోసం యత్నిస్తున్నారు. రఘురాజ్‌ ప్రతాప్‌ సింగ్‌ అలియాస్‌ రాజా భయ్యా ఏడోసారి కుండా అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. ఫతే బహదూర్‌ (బీజేపీ) ఆరుసార్లు గెలిచి కేంపియర్‌గంజ్‌ నుంచి సిద్ధంగా ఉన్నారు. అజయ్‌ ప్రతాప్‌ సింగ్‌ (బీజేపీ) కర్నల్‌ గంజ్‌ నుంచి, నరేంద్రసింగ్‌ వర్మ (ఎస్పీ) మహమ్మదాబాద్‌ నుంచి ఇక్బాల్‌ మహమ్మద్‌ (ఎస్పీ) సంబల్‌ నుంచి ఏడోసారి బరిలోకి దిగుతున్నారు. (క్లిక్: సింగిల్‌ డే సీఎం.. ఎవరో తెలుసా?)

20 ఏళ్లుగా చెరగని రికార్డు
ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, రాజస్థాన్‌ మాజీ గవర్నర్‌ కల్యాణ్‌ సింగ్‌ పదిసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన రికార్డు రెండు దశాబ్దాలుగా చెరగని రికార్డుగా ఉంది. తొలిసారి జనసంఘ్‌ నుంచి 1967లో ఎన్నికైన కల్యాణ్‌ సింగ్‌ 2002లో రాష్ట్రీయ క్రాంతి పార్టీ తరఫున పదోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్‌ గెలిస్తే ఈ రికార్డును సమయం చేసే అవకాశం ఉంది. 1967లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ తొమ్మిదిసార్లు ఎన్నికయ్యారు. (చదవండి: యూపీలో పోలింగ్‌కు... ఇస్లామాబాద్‌ సిద్ధం!)

Advertisement
 
Advertisement
Advertisement