పాశ్వాన్‌ వారసుడెవరో ప్రజలే తేలుస్తారు | Chirag Paswan announces aashirvaad yatra | Sakshi
Sakshi News home page

పాశ్వాన్‌ వారసుడెవరో ప్రజలే తేలుస్తారు

Jun 21 2021 6:27 AM | Updated on Jun 21 2021 8:19 AM

Chirag Paswan announces aashirvaad yatra - Sakshi

న్యూఢిల్లీ: బిహార్‌లోని లోక్‌జనశక్తి పార్టీలో బాబాయ్, అబ్బాయిల మధ్య పోరాటం కొత్త పరిణామాలకు దారి తీసింది. రామ్‌విలాస్‌ పాశ్వాన్‌కి తానే అసలు సిసలైన వారసుడినని చెప్పుకోవడానికి, పార్టీపై పట్టు పెంచుకోవడానికి చిరాగ్‌ ప్రజల ఆశీర్వాదం కోరనున్నారు. ఆదివారం ఢిల్లీలోని చిరాగ్‌ నివాసంలో పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించింది. చిరాగ్‌ ఇక తాను ప్రజల్లోకి వెళ్లి బాబాయ్‌ పశుపతి పరాస్‌ నీచ రాజకీయాలను ఎండగట్టాలని నిర్ణయించారు.

జూలై 5న రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ జయంతి రోజున హజీపూర్‌ నుంచి ఆశీర్వాద యాత్ర చేయనున్నారు. పరాస్‌ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, తానే జనంలోకి వెళ్లి వాస్తవాలన్నీ వెల్లడిస్తానని అన్నారు. అంతేకాదు ఈ సమావేశం పాశ్వాన్‌కి భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ కూడా చేసింది. సమావేశం ముగిసిన తర్వాత చిరాగ్‌ పాశ్వాన్‌ తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో మహాభారత యుద్ధాన్ని చూస్తారని ఆవేశంగా చెప్పారు. ‘‘వర్కింగ్‌ కమిటీ సభ్యుల్లో 90 శాతం నా వైపే ఉన్నారు. ఢిల్లీ, కశ్మీర్‌ పార్టీ అధ్యక్షులు మినహాయించి మిగిలిన వారంతా ఆ వైపు ఉన్నారు.

పశుపతి పరాస్‌ వైపు  9 శాతం మంది మాత్రమే ఉన్నారు’’అని చిరాగ్‌  వెల్లడించారు. మరోవైపు పరాస్‌ ఆ సమావేశానికి చట్టబద్ధత లేదన్నారు. సమావేశానికి హాజరైన వారంతా పార్టీ సభ్యులే కారని ఆరోపించారు. ఎవరిది అసలైన పార్టీ్టయో ఎన్నికల కమిషన్‌ నిర్ణయిస్తుందని విలేకరులతో చెప్పారు. పార్టీ ఎంపీలను తన వైపు తిప్పుకొని పరాస్‌ తిరుగుబాటు జెండా ఎగుర వేసినప్పటికీ బిహార్‌లో 6 శాతం జనాభా ఉన్న పాశ్వాన్‌ వర్గం ఇప్పటికీ చిరాగ్‌నే పార్టీ నాయకుడిగా చూస్తోంది. అంతేకాదు లాలూ ప్రసాద్‌ యాదవ్‌కి చెందిన ఆర్జేడీ కూడా పాశ్వాన్‌ జూనియర్‌కే మద్దతిస్తామని సూచనప్రాయంగా వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement