‘వెనక్కి తగ్గొద్దు.. దూకుడుగా వెళ్లండి’
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మంగళవారం పార్టీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో జగన్కు చెక్ పెట్టాలన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారని, ఎవరూ వెనక్కి తగ్గకుండా మరింత దూకుడుగా వెళ్లాలని సూచించారు. ఇప్పటికే కేసులు పెట్టినా, జైలుకు వెళ్లినా వెనక్కి తగ్గకుండా టీడీపీ నేతలు పోరాడుతున్నారన్నారు.
పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎవరూ విశ్రమించవద్దన్నారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్, జిల్లాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి పార్టీ నేతలను ఆయన అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో విశాఖ ఉక్కు అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని, అందరూ పోరాడి విశాఖ ఉక్కుని సాధించారని తెలిపారు. చదవండి: (తొలిదశలో టీడీపీకి షాక్)
నిమ్మగడ్డకు ఫిర్యాదు..
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల అభ్యర్థుల జాబితాను ప్రచురించలేదంటూ చంద్రబాబు ఎస్ఈసీ నిమ్మగడ్డకు ఫిర్యాదు చేశారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై కేసు పెట్టడాన్ని చంద్రబాబు ఖండించారు.