ఎన్నికల హామీలు బుట్టదాఖలు
బడ్జెట్లో ఊసేలేని ఉద్యోగుల సమస్యలు
ప్రస్తుతం నాలుగు డీఏ బకాయిలు ఉద్యోగులకు ఇవ్వాలి
సరెండర్ లీవుల్లో పోలీసులకు రావాల్సింది రూ.400 కోట్లు
ఇతర బకాయిల్లో ఏపీజీఎల్ఐ, టీఏ, మెడికల్ రీయింబర్స్మెంట్, గ్రూప్ ఇన్సూరెన్స్, లోన్లు మొదలైనవి ఉన్నాయి
సాక్షి, అమరావతి: మాయమాటలతో ఊరడించడం తప్ప ఉద్యోగులకు వాస్తవంలో చేసేదేమీ లేదని చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తేల్చేసింది. రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగుల సమస్యల ప్రస్తావనే లేకపోవడాన్ని బట్టి వారి ఆందోళనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పకనే చెప్పినట్లయింది. ఎ
న్నికల్లో తమకు ఇచ్చి న హామీల్లో ఒక్కదానినైనా నెరవేర్చాలని ఉద్యోగ సంఘాలు నిత్యం చేస్తున్న విజ్ఞాపనలను సైతం ప్రభుత్వ పెద్దలు పరిగణనలోకి తీసుకోలేదు. ప్రస్తుతం ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు దాదాపు రూ.40 వేల కోట్లకు చేరిపోయినట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.
జగన్ హయాంలో అందిన 11 డీఏలు
వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో 11 డీఏలు ఇవ్వగా, చంద్రబాబు 2014–19 మధ్య ఏడు డీఏలు మాత్రమే ఇచ్చారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఉద్యోగులను చిన్నచూపు చూస్తారనడానికి ఇదే ఉదాహరణని చెబుతున్నారు.
మరోవైపు ‘జగన్ ఏర్పాటు చేసిన వ్యవస్థ’ అనే కారణంతో గ్రామ స్థాయిలో తలలో నాలుకలా పని చేస్తున్న సచివాలయ ఉద్యోగులను చంద్రబాబు హీనాతిహీనంగా చూస్తూ బానిసలుగా మార్చివేయడం వారిని కలచివేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయకపోగా అసలు ఉద్యోగులను భయపెట్టి, బెదిరించేలా వ్యవహరించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
గారడీ ప్రకటనలు..
» గత సంక్రాంతికి ఒక డీఏ ఇచ్చినట్లు ప్రకటించినా, అందులోనూ ప్రభుత్వం గారడీ చేసింది. వేల కోట్ల బకాయిలు ఉంటే కేవలం రూ.1,100 కోట్లు ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అవి కూడా అందరు ఉద్యోగుల ఖాతాల్లో జమ కాలేదు.
» ఏడాది క్రితం పోలీసులకు ఇస్తానన్న రెండు సరెండర్ లీవులను విడతల వారీగా ఇస్తామన్నా, అది కూడా సరిగా ఇవ్వలేదు.
» ఎన్నికల్లో చెప్పిన మేరకు ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వడానికి కూటమి ముందుకు రావడం లేదు.
» డీఏ ఇచ్చేందుకు నిరాకరించడం, 12వ పీఆర్సీ నియమించేందుకే ముందుకు రాకపోవడాన్ని బట్టి ఈ ప్రభుత్వానికి తమను పట్టించుకునే ఆలోచన లేదని వారు వాపోతున్నారు.
» తాజా బడ్జెట్ను చూస్తే ఉద్యోగులకు ఈ ఏడాది కూడా ఇచ్చేది ఏమీ ఉండదని తేలింది.


