
సాక్షి ప్రతినిధి, వరంగల్: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రాముడి పేరిట బీజేపీ నేతలు దొంగ బుక్కులు తయారుచేసి చందాలు వసూలు చేస్తున్నారని చేసిన వ్యాఖ్యల దుమారం చల్లారక ముందే మరోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘ఆ కులం ఆఫీసర్లకు అక్షరం ముక్కరాదు.. ఎక్కడ చూసినా వాళ్లే.. మొత్తం నాశనం చేస్తున్నారు’ అంటూ హన్మకొండలో ఆదివారం జరిగిన ఓసీ జేఏసీ సభలో కొన్ని కులాలను ఉద్దేశించి ధర్మారెడ్డి వ్యా ఖ్యానించారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ సంఘాలు భగ్గుమన్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం ధర్మారెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశాయి. కుల సంఘాల ఆగ్రహంతో ఎమ్మెల్యే.. యూ టర్న్ తీసుకున్నారు. తాను చేసి న వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవి కావని, ఒకవేళ ఎవరి మనసునైనా నొప్పిస్తే వెనక్కి తీసుకుంటూ క్షమాపణ చెబుతున్నానని ధర్మారెడ్డి అన్నారు. (ఎమ్మెల్యే ఇంటిపై దాడి కేసులో 43 మందికి రిమాండ్)
ధర్మారెడ్డి తీరు సరికాదు
చిన్న కులాలను అవమానించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీరు గర్హనీయమని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్, ఎమ్మార్పీఎస్ నేత పుట్ట రవి, లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్సింగ్ నాయక్ పేర్కొన్నారు. (మా ఓపిక నశిస్తే.. బయట తిరగలేరు: కేటీఆర్)