
పార్టీ యంత్రాంగంలో యువతకు పెద్దపీట వేయాలని నిర్ణయం
సంస్థాగతంగా దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన అధినేత కేసీఆర్
ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన నేతలకు పార్టీ బాధ్యతలు
పార్టీ జిల్లా, రాష్ట్ర కమిటీల్లో ప్రధాన పదవులు వారికే
ఉద్యమంలో అండగా నిలిచిన ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి వర్గాలతో తిరిగి దోస్తీకి కసరత్తు
ఇప్పటికే కొందరితో సమావేశమై చర్చిస్తున్న పార్టీ కీలక నేతలు
వచ్చే నెలలో ఘనంగా పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించే యోచన
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, లోక్సభ ఎన్ని కల్లో వరుస ఓటముల నేపథ్యంలో బీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. పార్టీ యంత్రాంగంలో యువతకు పెద్దపీట వేయాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఈ ఏడాది జనవరిలో ఉమ్మడి జిల్లాలవారీగా విశ్లేషణ చేపట్టిన గులాబీ దళం.. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లోనూ ఓడి పోవడంపై లోతుగా విశ్లేషణ జరిపింది. పార్టీ నాయకులు, కేడర్తోపాటు వివిధ సంస్థలు, వర్గాల నుంచి అందిన నివేదికలు, సమాచా రాన్ని క్రోడీకరించి బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు కొందరు కీలక నేతలతో సారాంశాన్ని పంచుకున్నారు.
దశాబ్దకాలంగా పార్టీ, పాలనాపరంగా దొర్లిన తప్పులు, పొరపాట్లకు సంబంధించి ఈ నివేదికల ద్వారా అనేక సూచనలు అందినట్లు సమా చారం. వాటితోపాటు తాజాగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఇటీవల తాజా రాజకీయ పరిస్థితులను కూడా కేసీఆర్ మదింపు చేసి నట్లు సమాచారం. మరోవైపు జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకొనే మార్పులు, బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే కోణంలోనూ కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో ఇప్పటికే లోతుగా చర్చించారు. పార్టీ ఆవి ర్భావం నుంచి తెలంగాణ రాష్ట్ర అవతరణ వరకు బీఆర్ఎస్ ప్రస్థానం, ఆ తర్వాత పదేళ్ల పాటు పాలన సాగించిన తీరుతెన్నులను విశ్లేషించి దిద్దుబాటు ప్రణాళికను కేసీఆర్ ఖరారు చేసినట్లు సమాచారం.
దెబ్బతీసిన రాజకీయ పునరేకీకరణ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పాలనా సంస్కరణలు, మౌలికవసతుల కల్పనపై దృష్టి కేంద్రీకరించడంతో విద్యా ర్థులు, యువత, ఉద్యోగ వర్గాలు దూరమైన ట్లుగా బీఆర్ఎస్ నిర్ధారణకు వచ్చింది. ప్రైవేటు రంగంలో భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన జరిగినా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ ఉద్దేశపూర్వకంగా యువత, విద్యార్థులు ప్రేరేపించినట్లు గుర్తించింది. మరోవైపు కొన్ని సామాజికవర్గాలను కూడా బీఆర్ఎస్కు దూరం చేయడంలో ఈ రెండు పార్టీలు లోపాయికారీగా పనిచేశాయని పార్టీ నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు ఉద్యమ సమయంలో ఇతర పార్టీల నుంచి నేతల చేరిక బీఆర్ఎస్ బలోపేతానికి దోహదం చేయగా అధికారంలోకి వచ్చాక రాజకీయ పునరేకీకరణ పేరిట జరిగిన వలసలు పార్టీ క్షీణతకు దారితీసినట్లు నివేదికలు వెల్లడించాయి.
అధికార పార్టీలో చేరి పదవులు, ఆర్థిక ప్రయోజనాలు పొందిన నేతలే ఆ తర్వాత బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీలో క్రియాశీల పాత్ర పోషించారని నివేదించాయి. ఇతర పార్టీల నుంచి చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం, క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణం లేకపోవడం, ఎమ్మెల్యేలపైనే పార్టీ కార్యకలాపాలు పూర్తిగా ఆధారపడటం తదితర కారణాలతో పార్టీ దెబ్బతిన్నట్లు కేసీఆర్కు అందిన నివేదికలు వెల్లడించాయి. పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చడంతో ‘తెలంగాణ’ నినాదానికి దూరమైందని.. ఇతర రాష్ట్రాలపై దృష్టి పెంచడం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను అవకాశాలను దెబ్బతీసిందని గుర్తించారు.
అంతరాన్ని పూడ్చే ప్రయత్నాలు
రెండు దశాబ్దాలకుపైగా తెలంగాణ రాజకీయాలను శాసించిన బీఆర్ఎస్ ఇకపైనా అదే స్థాయిలో పనిచేసేలా చూడాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఉద్యమకాలం నుంచి పార్టీతో కలిసి నడుస్తున్న వారికి కీలక బాధ్యతలు అప్పగించడంపై దృష్టి సారించారు. గతంలో పార్టీతో సన్నిహితంగా మెలిగి ప్రస్తుతం స్తబ్దుగా ఉంటున్న వారిని గుర్తించి తిరిగి వారిని క్రియాశీలం చేయాలనుకుంటున్నారు. ఉద్యమ సమయంలో వెంట నడిచిన ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి వర్గాలు, వివిధ సామాజికవర్గాలకు దగ్గరయ్యేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి.
కీలక నేతలు కొందరు ఇప్పటికే ఆయా వర్గాలకు చెందిన వారితో సమావేశమై రాబోయే రోజుల్లో కలిసి పనిచేద్దామని ప్రతిపాదిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కేసీఆర్ తీరును ఎండగట్టిన కొందరు మేధావులు తాము ఇప్పటికిప్పుడే యూటర్న్ తీసుకొనే పరిస్థితి లేదంటూనే కొంత వ్యవధి కావాలని కోరుతున్నట్లు తెలిసింది.
కాంగ్రెస్ విధానాలతోనూ తాము సంతృప్తిగాలేమని చెబుతూ బీఆర్ఎస్తో కలిసి నడిచేందుకు సుముఖత చూపుతున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో భావసారూప్య వ్యక్తులు, సంస్థలతోనూ భేటీలు ముమ్మరం చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలియవచ్చింది. మరోవైపు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని కూడా వీలైనంత త్వరగా ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలక నేత హరీశ్రావు, ఇతర ముఖ్య నేతల నడుమ కూడా పని విభజన చేసి కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశముంది.
యువతకు కీలక బాధ్యతలు
పార్టీ సంస్థాగత నిర్మాణంలో యువతకు కీలక బాధ్యతలు అప్పగించడంతోపాటు వారిని క్షేత్రస్థాయి కార్యక్రమాల్లో మమేకం చేయనున్నారు. గతంలో వివిధ కార్పొరేషన్లు, కమిషన్ల చైర్మన్లు, సభ్యులుగా పనిచేసిన యువ నాయకులను పార్టీ తరఫున జరిగే క్షేత్రస్థాయి కార్యక్రమాల్లో ముందు వరుసలో నిలపనున్నారు. బాల్క సుమన్, గ్యాదరి కిషోర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, కె.వాసుదేవరెడ్డి, ఆంజనేయగౌడ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాజారాం యాదవ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, రాకేశ్రెడ్డి, శుభప్రద్ పటేల్, తుంగ బాలు, స్వామియాదవ్, ప్రవీణ్రెడ్డితోపాటు పలువురు యువ నేతలకు పార్టీ కమిటీల్లో చోటు కల్పించాలని నిర్ణయించారు.
ఇప్పటికే నియోజకవర్గాలవారీగా నేతలు, కార్యకర్తలతో ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ భేటీ అవుతున్నారు. ఆగస్టులో పార్టీ ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహించే యోచనలో ఆయన ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా బీజేపీ, కాంగ్రెస్లు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండటంతో సోషల్ మీడియా విభాగాన్ని కూడా పటిష్టం చేయడంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది.