కేసీఆర్‌ సూచనతోనే బనకచర్ల!: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Fires On KCR About Banakacharla | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ సూచనతోనే బనకచర్ల!: సీఎం రేవంత్‌

Jun 19 2025 1:06 AM | Updated on Jun 19 2025 1:06 AM

CM Revanth Reddy Fires On KCR About Banakacharla

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఎంపీలతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

వృథాగా సముద్రంలో కలుస్తున్న 3 వేల టీఎంసీల గోదావరి

జలాలను రెండు రాష్ట్రాలు వాడుకోవాలని నాటి సీఎం అన్నారు 

2016 అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు సూచించారు 

ఆ సూచనతోనే బనకచర్ల ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది

2019లో సీఎంలు కేసీఆర్, జగన్‌ నాలుగుసార్లు సమావేశమయ్యారు 

400 టీఎంసీల గోదావరి జలాలు రాయలసీమకు తరలింపుపై చర్చించారు.. దాని ఆధారంగానే  300 టీఎంసీలు తరలించేలా ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదించింది 

నాటి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం మినిట్స్‌నే తెలంగాణకు గుదిబండగా మార్చాలని ఏపీ చూస్తోందన్న సీఎం

సీఎం వ్యాఖ్యలకు అభ్యంతరం తెలిపిన బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు 

తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కేసీఆర్‌ ఆ ప్రతిపాదనలు చేశారని స్పష్టీకరణ.. సమావేశం నుంచి వాకౌట్‌ 

బనకచర్లను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాం.. రాజకీయ ప్రయత్నాలు ఫలించకపోతే న్యాయపోరాటం చేస్తామన్న రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్‌లో నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన దశలోని ప్రాజెక్టులకు వెయ్యి టీఎంసీలకి మించి నీళ్లు అవసరం. ఏటా 3 వేల టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. నీటి లభ్యత ఉన్న నేపథ్యంలో రెండు రాష్ట్రాలు చర్చించుకుని నీళ్లను వాడుకోవాలని 2016 సెపె్టంబర్‌ 21న అప్పటి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో నాటి తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించారు. 

ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 3 వేల టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని కనిపెట్టింది కేసీఆరే. ఆ నీటి వినియోగంపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది ఆయనే. కేసీఆర్‌ సూచన నుంచే గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం మినట్స్‌లో కేసీఆర్‌ చేసిన సూచనలను రికార్డు చేశారని, ఆ మినట్స్‌ కాపీని ఎంపీలందరికీ అందజేస్తామని చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్‌ చేపడుతున్న గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నికర జలాల వినియోగం పూర్తి కాకముందే మిగులు జలాల లభ్యతను ఎలా తేల్చుతారంటూ బీజేపీ ఎంపీ రఘునందర్‌రావు అడిగిన ప్రశ్నకు సీఎం బదులిస్తూ కేసీఆర్‌పై ఆరోపణలు చేశారు.  

గోదావరి జలాల తరలింపే ఆ భేటీల లక్ష్యం 
‘చంద్రబాబు, కేసీఆర్‌ మధ్య సమస్యలు రావడంతో 2016 తర్వాత 3 వేల టీఎంసీల మిగులు జలాల అంశం మరుగున పడిపోయింది. ఆ తర్వాత 2019 ఆగస్టులో నాటి ఏపీ సీఎం జగన్‌తో ప్రగతిభవన్‌లో నాటి తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమావేశమై మళ్లీ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం అని ఆ సమావేశంలో కేసీఆర్‌ అన్నారు. కేసీఆర్, జగన్‌లు ప్రగతిభవన్‌లో నాలుగుసార్లు సమావేశమై గోదావరి జలాలను రాయలసీమకు తరలించుకోవడంపై చర్చలు జరిపారు. 

గోదావరి జలాలను కృష్ణా, పెన్నా బేసిన్లకు తరలించడమే నాటి సమావేశాల లక్ష్యం. ఈ నేపథ్యంలోనే బనకచర్ల ప్రాజెక్టును ప్రస్తుతం ఏపీ చేపట్టింది. 400 టీఎంసీలను రాయలసీమకు తరలించాలని అప్పట్లో కేసీఆర్, జగన్‌ మాట్లాడుకున్నారు. అందులో భాగంగానే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా నేరుగా 200 టీఎంసీలు, పరోక్షంగా 100 టీఎంసీలు కలిపి 300 టీఎంసీలను తరలిస్తామంటూ ఏపీ తాజాగా ప్రతిపాదించింది..’ అని రేవంత్‌ చెప్పారు.  

ఆ మినట్స్‌నే గుదిబండగా మార్చాలని ఏపీ చూస్తోంది.. 
రాయలసీమకు గోదావరి జలాల తరలింపునకు పెద్దన్నగా సహకరిస్తా అని నాడు కేసీఆర్‌ హామీ ఇచ్చినట్టు పత్రికల్లో వచ్చిన వార్తలను సీఎం రేవంత్‌ రెడ్డి చదివి వినిపించారు. దీనిపై బీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభ్యంతరం తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా గోదావరి జలాలను శ్రీశైలంకు తరలించి.. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు తరలించే ఉద్దేశంతో కేసీఆర్‌ ఆ ప్రతిపాదనలు చేశారని వివరణ ఇచ్చారు. 

బనకచర్లతో తెలంగాణ నష్టపోకుండా ప్రభుత్వానికి సహకరించడానికే తాము ఈ భేటీకి వచ్చామన్నారు. సీఎం జోక్యం చేసుకుని అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం మినట్స్‌లో ఉన్న అంశాలను మళ్లీ చదివి వినిపిస్తా అని అన్నారు. ‘గోదావరి నీళ్లను శ్రీశైలంలో వేయాలంటే తొలుత సాగర్‌లో వేయాల్సి ఉంటుంది. కానీ బనకచర్ల ప్రాజెక్టు ద్వారా సాగర్‌లో వేయకుండా నీళ్లను నేరుగా తరలించుకుంటామని ఏపీ ప్రతిపాదించింది. 

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన అపెక్స్‌ కౌన్సిల్‌లో ఏపీ, తెలంగాణ సీఎంలు చర్చించిన తీసుకున్న నిర్ణయం ప్రకారమే బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తున్నామని ఏపీ వాదిస్తోంది..’ అని చెప్పారు. దీంతో.. రాజకీయ ఉద్దేశంతో జరుగుతున్న ఈ సమావేశం నుంచి తాము వాకౌట్‌ చేస్తున్నట్టు వద్దిరాజు ప్రకటించారు. బీజేపీ ఎంపీ డీకే అరుణ నచ్చజెప్పబోగా, ‘పోనీయండి’ అంటూ సీఎం వారించారు. 

కొన్ని వాస్తవాలు బయటకు వచ్చినందుకు మిత్రుడు కొంత ఇబ్బంది పడ్డట్టు ఉన్నాడని వ్యాఖ్యానించారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం మినట్స్‌నే తెలంగాణకు గుదిబండగా మార్చడానికి ఏపీ ప్రయత్నిస్తోందని అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీల కేటాయింపులను  2015లో నాటి సీఎం కేసీఆర్‌ అంగీకరించడంతో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని విమర్శించారు. 

జూలైలో ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తాం 
బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి టెక్నికల్, లీగల్, పొలిటికల్‌..మూడు మార్గాల్లో ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. గురువారం మళ్లీ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కలిసి అభ్యంతరం తెలుపుతామని అన్నారు. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో ఈ సమావేశానికి రాలేమని కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌ రెడ్డిలు సమాచారం ఇచ్చారని, వారిని సైతం సీఆర్‌ పాటిల్‌ వద్దకు తీసుకెళ్తామని చెప్పారు. 

జూలైలో జరిగే పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీతో పాటు కేంద్ర జలశక్తి, ఆర్థిక, పర్యావరణ శాఖల మంత్రులను కలిసి అభ్యంతరాలు తెలియజేస్తామని వెల్లడించారు. రాజకీయ ప్రయత్నాలు ఫలించకపోతే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఎంపీ అసదుద్దీన్‌ సూచించినట్టు జలవివాదాల్లో నిపుణులైన న్యాయవాదులను నియమించుకుంటామని చెప్పారు. 

పార్టీలకు అతీతంగా బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఎంపీలందరూ ఈ సమావేశంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దామని ప్రతిపాదించారు. తెలంగాణ ప్రయోజనాలను పరిక్షించిన తర్వాతే ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరదామన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్, సలహదారు ఆదిత్యనాథ్‌ దాస్‌లు ఎంపీలను సమన్వయం చేస్తారన్నారు. 

కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్‌ ప్రాజెక్టులపై ఒక డాక్యుమెంట్‌ తయారు చేసి ఎంపీలందరికీ అందించాలని ఆదిత్యనాథ్‌ను ఆదేశించారు. సీఎం ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్తాడంటూ విమర్శలు చేస్తున్నారని, నిరంతరం వెళ్లి సంప్రదింపులు చేస్తేనే ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయని సీఎం అన్నారు. 

భవిష్యత్తులో సైతం కేంద్రంతో సంబంధాలు కొనసాగిస్తామన్నారు. కాంగ్రెస్‌ ఎంపీలు రేణుకా చౌదరి, మల్లు రవి, బలరాం నాయక్, సురేష్‌ షెట్కార్, కుందూరు రఘువీర్‌ రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్, రఘురాం రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, రఘునందన్‌ రావు, ఎంఐఎం నుంచి అసదుద్దీన్‌ ఒవైసీ పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement