
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నా తప్పుడు ప్రచారం ఆపడం లేదని.. తెలంగాణ అభివృద్ధిలో ప్రభుత్వంతో ఆ పార్టీ కలిసి రావడం లేదంటూ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపీల అఖిలపక్ష సమావేశం తర్వాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గోదావరి జలాల్లో తెలంగాణకు జరుగుతున్న నష్టం గురించి ఎంపీలకు వివరించామని తెలిపారు.
‘‘రాజకీయ ప్రయోజనాలు, సంకుచిత స్వభావంతో బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది. భవిష్యత్ కార్యాచరణపై ఎంపీల సూచనలు తీసుకున్నాం. అన్ని పార్టీల ఎంపీలను ఆహ్వానించి, సుదీర్ఘంగా వివరించామని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లో బతికించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. దురుద్దేశంతో బీఆర్ఎస్ నాపై తప్పుడు ప్రచారం చేస్తోంది. బనకచర్ల ప్రాజెక్టుకు ఆద్యం పోసిందే కేసీఆర్’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.
‘‘2016 అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ 3 వేల టీఎంసీ నీళ్లు అనే పదం నుంచి బనకచర్ల పుట్టింది. 3 వందల టీఎంసీలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. రెండు వందల టీఎంసీలు లిఫ్ట్ చేయడానికి చంద్రబాబు ప్లాన్ చేశారు. అనాడు కేసీఆర్ నాలుగు వందల టీఎంసీలు అన్నారు. అందుకే చంద్రబాబు ప్లాన్ మొదలు పెట్టారు. చంద్రబాబు బనకచర్ల అనగానే కేంద్ర జలశక్తి, ఆర్థిక మంత్రికి ఫిర్యాదులు చేశాం.
..బనకచర్ల పై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా లేదు. మేము ఇచ్చిన ఫిర్యాదులకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఉరి తీయ్యాల్సింది కేసీఆర్, హరీష్ రావునే. తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ ప్రయత్నం చేయలేదు. చేసిందంతా కేసీఆర్, హరీష్ రావు చేసి.. నింద మాపై మోపుతారా?. కమీషన్లకు కకుర్తిపడి తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్, హరీష్రావు. లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదు. సాగునీటి ప్రాజెక్టు పై 2లక్షల కోట్ల బిల్లులు చెల్లించారు.
ఇవాళ సాగునీటి ప్రాజెక్టుల కోసం 500 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మనుషులు చనిపోతే హరీష్రావు కళ్లలో పైశాచిక ఆనందం వెళ్లబుచ్చుతారు. పేదలు ఎవరైనా చనిపోతే ఒక్క రూపాయి పేదలకు ఇవ్వలేదు. హరీష్ రావు చిల్లర ప్రయత్నాలు మానాలి. 2016 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్ చూసి తలకాయ ఎక్కడ పెట్టుకుంటాం హరీష్ రావు. ఢిల్లీ వెళ్తే తప్పేంటి.. మీరు చేసిన తప్పులు మేము సెట్రేట్ చేస్తున్నాం. పది పైసల మిత్తికి 50వేల మిత్తికి హరీష్ రావు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మా టార్గెట్.
తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తాం. బనకచర్ల పై అవసరం అయితే ప్రధాన మంత్రిని కలుస్తాం. అందరినీ కలిసిన తర్వాత కోర్టుకు సైతం వెళ్తాం. చంద్రబాబుకు నేను సూచన చేస్తునా!. కేంద్రంలో పలుకుబడి ఉండొచ్చు.. ప్రధాని ఏదైనా వినొచ్చు అనుకుంటే మీ భ్రమ. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎక్కడివరకైనా వెళ్తాం. మేము తెలంగాణ ప్రజల కోసం కోర్టుకు అయినా వెళ్తాం. 968 టీఎంసీల నీళ్లను తెలంగాణ వాడుకోవడానికి బ్లాంకెట్గా అనుమతి ఇవ్వాలి’’ అని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు.