
కొందరు నేతలు పోయినంత మాత్రాన నష్టమేమీ లేదు
ఎర్రవల్లిలోని నివాసంలో పార్టీ నాయకులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్య
కార్యకర్తలనే నాయకులుగా తీర్చిదిద్దుకుందాం
కాంగ్రెస్ మోసాలను ప్రజలంతా గమనిస్తున్నారు
తిరిగి ఆదరించి, రెట్టింపు మద్దతుతో గద్దెపై కూర్చోబెడతారు
పార్టీ ప్రస్థానం కొనసాగుతుంది.. భవిష్యత్ బీఆర్ఎస్దేనని ధీమా
మర్కూక్ (గజ్వేల్)/ సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు బుల్లెట్ల వంటి కార్యకర్తలు ఉన్నారని, వారే రేపటి నాయకులని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. కొంతమంది స్వార్థపరులు పోయినంత మాత్రాన బీఆర్ఎస్కు నష్టమేమీ లేదన్నారు.
పార్టీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం కొనసాగుతుందని, భవిష్యత్ బీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు. గురువారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో హుజూరాబాద్, ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..
‘‘ఆరు దశాబ్దాలపాటు దిక్కూమొక్కూ లేక కొట్టుమిట్టాడిన తెలంగాణను ఓ దరికి చేర్చేందుకు గులాబీ జెండా ఉద్యమ కేతనమై ఎగిరింది. తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యాన్ని సాధించేందుకు ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర మనది. తెలంగాణ సాధించిన ఘనత కన్నా నాకు సీఎం పదవి పెద్ద విషయం కాదు.
ప్రజలు మోసపోయారు
ప్రత్యేక రాష్ట్రం సాధించే నాటికి సమైక్య పాలనలో తెలంగాణది దిక్కూమొక్కూ లేని పరిస్థితి. రాష్ట్ర పాలన పగ్గాలు చేపట్టి సాగునీరు, తాగునీరు, కరెంటు వంటి అనేక కీలక వసతులు కల్పించుకున్నాం. అన్ని రంగాల్లో తెలంగాణను తీర్చిదిద్దుకున్నాం. పదేళ్ల స్వల్పకాలంలోనే అద్భుత ప్రగతి సాధించుకున్నాం. ఇటువంటి సమయంలో ప్రజలు ఊహించని తీర్పునిచ్చారు.
కొన్ని కొన్ని సార్లు ఇలాంటి తమాషాలు జరుగుతుంటాయని చరిత్రలోకి వెళితే అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలను నమ్మి ప్రజలు మోసపోయారు. పాలిచ్చే బర్రెను వదిలి దున్నపోతును తెచ్చుకున్నట్లు అయిందంటూ ఇప్పుడు బాధపడుతున్నారు. బీఆర్ఎస్ సర్కారులో అందిన లబ్ధి ఇప్పుడు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఎంతో కష్టపడి దరికి తెచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పాలనలో దారి తప్పింది.
పార్టీ యే నాయకులను సృష్టిస్తుంది
ఎప్పుడూ పార్టీ నాయకులను సృష్టిస్తుంది. నాయకులు పార్టీ లోకి వచ్చిపోతుంటారు. కొందరు నాయకులు వీడినంత మాత్రాన పార్టీ కి ఎటువంటి నష్టం రాదు. బీఆర్ఎస్ పార్టీ కి బుల్లెట్ల వంటి కార్యకర్తలున్నారు. వారినే నాయకులుగా తీర్చిదిద్దుకుందాం. పార్టీ బీఫారం ఇచ్చి అవకాశమిస్తే.. ఎవరైనా సిపాయిలుగా తయారవుతారు. ప్రజల్లో చైతన్యం వచ్చి కాంగ్రెస్ చేసిన మోసాన్ని గుర్తిస్తారు.
తిరిగి బీఆర్ఎస్ను ఆదరిస్తారు. అప్పటిదాకా ఓపికతో ప్రజాసమస్యలపై దృష్టి సారించాలి..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రశాంత్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, కందాల ఉపేందర్రెడ్డి, సీనియర్ నాయకులు జహంగీర్, దుండిగల రాజేందర్, చైర్మన్లు, సర్పంచులు, ఇతర నేతలు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ను మించి ప్రజలు మనకు మద్దతిస్తారు
తెలంగాణ కోసం సాగిన మన 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ఆగలేదు, అయిపోలేదు. ఒకసారి ఓడగొట్టిన ఎనీ్టఆర్ను తిరిగి ఎలాగైతే ప్రజలు గద్దె మీద కూర్చోబెట్టారో అంతకన్నా గొప్పగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరిగి ఆదరిస్తారు. అంతకంటే రెట్టింపు మద్దతుతో మనను గద్దె మీద కూర్చుండబెట్టే రోజు త్వరలోనే వస్తుంది. కాంగ్రెస్ పాలన రోజురోజుకూ దిగజారుతోంది.
స్టీరింగ్ పట్టిన కేసీఆర్
ఫామ్హౌజ్లో మినీ వ్యాన్ నడిపిన బీఆర్ఎస్ అధినేత
మర్కూక్ (గజ్వేల్): బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్టీరింగ్ పట్టారు. గురువారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో కాసేపు మినీ వ్యాన్ నడిపారు. అందులో ఎమ్మెల్యేలు, నేతలను కూర్చోబెట్టుకుని ఫామ్హౌజ్లో కలియదిరిగారు. కొన్నినెలల క్రితం కేసీఆర్కు తుంటి ఎముక విరగడంతో, శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. తర్వాత చాలా రోజులు చేతికర్ర సాయంతో నడిచిన ఆయన.. ఇటీవలే వైద్యుల సూచన మేరకు చేతికర్ర వదిలేసి నడవడం మొదలుపెట్టారు.
తాజాగా తన ఫామ్హౌజ్లో ఓమ్నీ వ్యాన్ నడుపుతూ కనిపించారు. వ్యాన్లో కేసీఆర్తోపాటు ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి తదితరులు ఉన్నారు.
కవితా సంకలనాన్ని అందజేసిన కవయిత్రి మహెజబీన్ బేగ్ ప్రముఖ స్త్రీవాద కవయిత్రి మహెజబీన్ బేగ్ గురువారం ఎర్రవల్లిలో కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా తన కవితా సంకలనం ం‘ఆకులురాలు కాలం’ంపుస్తకాన్ని కేసీఆర్కు అందజేశారు.