
హైదరాబాద్: మరో రెండు రోజుల్లో తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు రాబోతున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. రేపు(సోమవారం, జూన్ 30వ తేదీ) నామినేషన్ ప్రక్రియ ఉండబోతుందని, ఎవరికి వారే తానే ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్నారని రాజాసింగ్ అన్నారు. తనకు అనేక మంది కార్యకర్తలు ఫోన్లు, మెసేజ్లు చేస్తున్నారన్నారు.
మనం ఎందుకు ప్రెసిడెంట్గా పోటీ చేయకూడదని చాలా మంది అడుగుతున్నారన్నారు. అందుకే తాను కూడా అధ్యక్ష పదవి అడగాలని అనుకుంటున్నానని తెలిపారు. చాలా మంది కార్యకర్తల మనస్సులో ప్రెసిడెంట్ అంటే ఎలా ఉండాలో అనుకునే విషయాన్ని రాజాసింగ్ పేర్కొన్నారు
‘బీజేపీకి వీఐపీ లాంటి వ్యక్తి ప్రెసిడెంట్ ఉండకూడదు. కార్యకర్తలు అన్న అని పిలిచే ప్రజల మనిషి అయిన వారు ప్రెసిడెంట్ గా ఉండాలి. నేను ప్రెసిడెంట్ అయితే గోరక్ష కోసం ప్రత్యేకంగా టీమ్ ఏర్పాటు చేస్తా. బీజేపీ కార్యకర్తలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అండగా ఉండేలా ఏర్పాట్లు చేస్తా.. నేరుగా కలిసే ప్రయత్నం చేస్తా. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ స్టైల్ లో ముందకు వెళ్తాం.
యోగి పేరు వింటే దొంగలు, గూండాలు, రౌడీలు యూపీ వదలి వేరే రాష్ట్రానికి పారిపోతున్నారు. ఆ సిస్టమ్ ను తెలంగాణలో అమలు చేస్తాం. రాజాసింగ్ ప్రెసిడెంట్ కావాలి అనుకునే వాళ్లు నా పేరును కేంద్ర నాయకులకు చెప్పండి’ అని రాజాసింగ్ స్పష్టం చేశారు.