‘ఓవైసీ చవకబారు విమర్శలను ఖండిస్తున్నాం’ | Bandi Sanjay Slams Asaduddin Owaisi Comments On Ram Mandir | Sakshi
Sakshi News home page

‘వేల ఏళ్లుగా ఉన్న రామ మందిరాన్ని ఎవరు ధ్వంసం చేశారు’

Jul 29 2020 2:44 PM | Updated on Jul 29 2020 2:57 PM

Bandi Sanjay Slams Asaduddin Owaisi Comments On Ram Mandir - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అయోధ్యలో రామ మందిర నిర్మాణ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్‌ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ద్వజమెత్తారు. ఈ మేరకు బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మభూమి రామ మందిర నిర్మాణ ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ప్రధానమంత్రిపై అసదుద్దీన్‌ ఓవైసీ చవకబారు విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆగస్టు 5న జరిగే భూమి పూజ కార్యక్రమానికి ప్రధానమంత్రి  నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా హాజరై, శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. (ప్రధాని మోదీపై ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు)

దీనిపై అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవించడమే సెక్యులరిజమని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల ఆకాంక్ష మేరకు, ప్రధాని రామమందిర శంకుస్థాపనకు వస్తున్నారని తెలిపారు. ఈ ఆలయం కేవలం హిందూ మతస్తులకు చెందింది కాదని, ఇది భారతీయుల ఆలయయని పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన ఈ మహాయజ్ఞ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ  పాల్గొనడం భారతీయులందరికీ గర్వకారణమని బండి సంజయ్‌ కొనియాడారు. (కేసీఆర్‌ వల్లే వారికి కరోనా సోకింది’)

400 ఏళ్లుగా అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదు ఉంది అనడం నిజమైతే మరీ అంతకుముందు వేల ఏళ్లుగా అక్కడ ఉన్న శ్రీ రామ మందిరాన్ని ఎవరు ధ్వంసం చేశారని బండి సంజయ్‌ ప్రశ్నించారు. భారత ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదించిన మేరకు ఎటువంటి సమస్యలు లేకుండా, అందరిని కలుపుకుంటూ, ఆమోదయోగ్యంగా, శాంతియుతంగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతుందన్నారు. దేశ ప్రధానిగా సర్వ మానవాళి క్షేమాన్ని కోరుకునే హిందూ మతానికి చెందిన వ్యక్తిగా మోదీ  కోట్లాదిమంది ఆకాంక్షలకు అనుగుణంగా, అయోధ్యలో చేపట్టే భవ్య రామమందిర నిర్మాణానికి పునాది వేసే అపూర్వ ఘట్టంలో  పాల్గొనడం చారిత్రాత్మక అవసరమని ఆయన‌ అన్నారు. (రాంమందిర నిర్మాణంపై శివసేన కీలక వ్యాఖ్యలు)

Advertisement
 
Advertisement
Advertisement