కేజ్రీవాల్‌ పొలిటికల్‌ ప్లాన్‌ షురూ.. రాజకీయాల్లో చర్చ..!

Arvind Kejriwal Visit Sabarmati Ashram At Gujarat - Sakshi

గాంధీనగర్‌: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ తన మార్క్‌ చూపించింది. పంజాబ్‌లో భారీ మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అనంతరం పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం మాన్‌.. రెండు పర్యటనలో భాగంగా గుజరాత్‌లోని శనివారం అహ్మ‌దాబాద్‌లోని స‌బర్మ‌తీ ఆశ్ర‌మం సంద‌ర్శించారు. ఈ క్రమంలో ఆశ్రమంలో ఉన్న మ‌హాత్మా గాంధీ చ‌ర‌ఖా తిప్పారు. అనంతరం అక్కడే ఉన్న మ్యూజియాన్ని సందర్శించారు. కాగా, స్వాతంత్ర్య ఉద్యమంలో సబర్శతి ఆశ్రమం నుంచే మహాత్మా గాంధీ.. ఉప్పు సత్యాగ‍్రహం, దండి యాత్ర వంటి ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేజ్రీవాల్‌.. ఈ ఆశ్ర‌మం ఆథ్యాత్మిక ప్ర‌దేశ‌మ‌ని, గాంధీజీ స్ఫూర్తి త‌మ‌లో ఆధ్యాత్మిక భావ‌న‌లు రేకెత్తిస్తోంద‌ని గాంధీ పుట్టిన దేశంలో తాను జ‌న్మించ‌డం గ‌ర్వకార‌ణ‌మని కేజ్రీవాల్ తెలిపారు. ఈ క్రమంలో భగవంత్‌ మాన్‌ స్పందిస్తూ.. గాంధీ ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించ‌డం సంతోషంగా ఉంద‌ని భిన్న‌మైన అనుభూతి క‌లుగుతోంద‌ని పేర్కొన్నారు. మరోవైపు.. వీరి పర్యటనలో రాజకీయ విషయాలపై మీడియా కేజ్రీవాల్‌ను ప్రశ్నించగా.. ఇక్కడ పాలిటిక్స్‌ మాట్లాడవద్దని సున్నితంగా తిరస్కరించారు.  

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది చివ‌రిలో జ‌రిగే గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటేందుకు ఆప్‌ నేతలు ఇక్కడ పర్యటిస్తున్నారని రాజకీయంగా చర్చ నడుస్తోంది. కాగా, గుజ‌రాత్‌లోని మొత్తం 182 స్ధానాల్లో త‌మ పార్టీ పోటీ చేస్తుంద‌ని కేజ్రీవాల్ ఇప్ప‌టికే వెల్ల‌డించారు. దీంతో ఇప్పటి నుంచే గుజరాత్‌పై కేజ్రీవాల్‌ ఫోకస్‌ చేసినట్టు తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top