గ్లాస్‌ పవన్‌ ది.. ఛాయ్‌ చంద్రబాబుది: నందిగం సురేశ్ | Andhra Pradesh: Nandigam Suresh Fires On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

గ్లాస్‌ పవన్‌ ది.. ఛాయ్‌ చంద్రబాబుది: నందిగం సురేశ్

Jul 1 2023 7:21 PM | Updated on Jul 1 2023 7:35 PM

Andhra Pradesh: Nandigam Suresh Fires On Pawan Kalyan - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రస్తావనకొచ్చేసరికల్లా పవన్‌కళ్యాణ్‌ తన బానిసత్వాన్ని సమర్ధంగా నిరూపించుకుంటున్నాడని బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ ధ్వజమెత్తారు. ‘సభలో బాబు విషయానికొచ్చేసరికి ఒక పొట్టిశ్రీరాములు, ఒక పుచ్చలపల్లి సుందరయ్య అంటూ పోలిక చెబుతున్నారు.. బాబుకు బానిసగా పనిచేసే విషయంలో ఎక్కడా అలసటనేది లేకుండా.. చురుగ్గా, సమర్ధవంతంగా పనిచేస్తున్న వ్యక్తిగా పవన్‌కళ్యాణ్‌ను చెప్పుకోవచ్చని’ వ్యంగాస్త్రాలు సంధించారు.

 వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘2019లో కూడా పవన్‌కళ్యాణ్‌ అనే వ్యక్తి గాజువాక, భీమవరంలో ఓడిపోవడానికి కారణం కూడా చంద్రబాబేనని చెప్పాలి. ఎందుకంటే, ఆ రెండు చోట్ల పోటీకి దిగాలని అప్పట్లో బాబే పవన్‌కు చెప్పి నిలబెట్టాడని చాలామంది చెబుతుంటారు. యజమాని చెప్పింది చేయాల్సిందే కనుకే ఆయన ఆ రెండు చోట్ల ఓడిపోయి కూర్చొన్నాడని’ ఎద్దేవా చేశారు. 

గ్లాస్‌ పవన్‌దైనా.. ఛాయ్‌మాత్రం చంద్రబాబుదే..
‘క్లాస్‌వార్‌ గురించి మాట్లాడే పవన్‌కళ్యాణ్‌ను నేను కొన్ని ప్రశ్నలేస్తున్నాను. వాటిపై సమాధానాలిచ్చే దమ్మూధైర్యం ఉంటే ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నాం. ఈ పవన్‌కళ్యాణ్‌ అనే వ్యక్తి ఏ క్లాస్‌ వారితో అంటకాగుతున్నాడు..? ఏ క్లాస్‌ వ్యక్తుల దగ్గర ప్యాకేజీ తీసుకున్నావు..? గతంలో ఓడిపోయిన రెండుచోట్లా ఎన్నికల ఖర్చును ఏ క్లాస్‌ వారి దగ్గర్నుంచి తీసుకున్నావు..? పవన్‌కళ్యాణ్‌ గ్లాసులో టీ పోసింది చంద్రబాబు అని భీమవరం, గాజువాకలో ఏ ఒక్క చిన్నపిల్లోడ్ని అడిగినా చెబుతాడు. పవన్‌కళ్యాణ్‌ను ఆ గ్లాసు పట్టుకుని ఆ రెండు చోట్ల నిల్చోమన్నాడు. ఆ తర్వాత చంద్రబాబు వచ్చి ఆ గ్లాసులో ఛాయ్‌ పోశాడని పవన్‌ బాగోతం గురించి ప్రజలే చెబుతున్నారని’ చెప్పారు.

పేదలకు పథకాలు ఇస్తే శ్రీలంక అవుతుందా..?
‘‘పవన్‌కళ్యాణ్‌ అనే వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టింది ప్రజలకు సేవ చేయటానికని అంటున్నాడు. తాను భవిష్యత్తులో ప్రజలకు మేలు చేస్తానంటూ.. ఇప్పటి ప్రభుత్వం అందించిన మేలు కంటే మిన్నగా చేస్తామని చెబుతున్నారు కదా..? రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని డీబీటీ ద్వారా రూ.2.23 లక్షల కోట్ల లబ్ధిని ప్రజలకు అందించారు. దీనిపై ఇటు పవన్‌కళ్యాణ్, అటు చంద్రబాబు మాత్రం రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని గుండెలు బాదుకుంటున్నారు. ఇక్కడ అమలయ్యే పథకాల్ని కొనసాగిస్తామంటారు. పక్కరాష్ట్రాల్లోని పథకాల్ని కాపీ కొట్టి చేస్తామంటారు. మొత్తానికి వీరిద్దరూ కాపీపేస్టు వీరులని చెప్పుకోవచ్చని’’ మండిపడ్డారు.

చదవండి: ‘ఈనాడు’ అసలు బాధ అదేనా?.. ఎందుకీ పడరాని పాట్లు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement