పెద్దపల్లి: జిల్లాను క్షయ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం ప్రధానంగా హైరిస్క్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అనుమానితులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. దీంతో టీబీ ముక్త్ భారత్ అభియాన్ పథకంలో జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. అధికారు లు, సిబ్బంది భాగస్వామ్యంతో రాష్ట్రస్థాయి అవా ర్డు కూడా సొంతం చేసుకుంది. ఉద్యోగుల, వైద్య సిబ్బందిని కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు.
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులే..
సుగర్, బీపీ, క్యాన్సర్ తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతోపాటు కాలుష్య తీవ్రత అధికంగా ఉండే సుల్తానాబాద్, గోదావరిఖని, రామగుండం, పెద్దపల్లి తదితర ప్రాంతాల్లోని ప్రజలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే ఎక్స్రేలు తీయడం దాదాపు పూర్తిచేశారు.
జిల్లాలో 18 పీహెచ్సీలు..
జిల్లాలో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 8 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఎక్స్రే టెస్టులు పూర్తిచేశారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 53,093 ఎక్స్రేలు నమోదు చేయగా 471 మందిలో టీబీ అనుమానిత పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వివరిస్తున్నారు. 8,916 తెమడ పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకు 340 టీబీ కేసులు నమోదైనట్లు వైద్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
గతేడాది విస్తృతంగా పరీక్షలు
2025లో టీబీ ముక్త్ భారత్ అభియాన్ పథకం ద్వారా జిల్లాలో 1,39,344 పరీక్షలు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. అయితే, లక్ష్యానికి మించి 1,58,093 పరీక్షలు చేశారు. 21,769 తెమడ పరీక్షలు చేయగా.. 1,063 ఎక్స్రే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ ఏడాది జిల్లాలో 1,783 టీబీ కేసులను అధికారులు గుర్తించారు.
చికిత్స అందిస్తూ..
టీబీ లక్షణాలు ఉన్నవారిని ముందస్తుగా గుర్తించి ఎక్స్రే, తెమడ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్గా నిర్ధారణ అయిన వారికి చికిత్స అందిస్తూ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
గ్రామాల్లో ముమ్మరంగా వైద్యపరీక్షలు
ఇప్పటికే 53 వేల వరకు ఎక్స్రేలు నమోదు చేసిన సిబ్బంది
జిల్లావ్యాప్తంగా వెలుగులోకి 340 టీబీ కేసులు


