పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్లోని షాపింగ్ కాంప్లెక్స్(రాజీవ్ రోడ్డును ఆనుకుని ఉన్న) గదులను ఓపెన్ టెండర్ పద్ధతిన అద్దెకు ఇవ్వనున్నట్టు మార్కెట్ కమిటీ చైర్మన్ కూర మల్లారెడ్డి, ఉన్నతశ్రేణి కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 31లోగా రూ.3వేలు చెల్లించి టెండర్ ఫారం పొంది రూ.50వేల ధరావత్తు చెల్లించాలని కోరారు. ఒక్కో గదికి అద్దెను ప్రభుత్వం రూ.15,472గా నిర్ణయించిందని పేర్కొన్నారు. టెండర్దారులతో ఆగస్టు 3న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వేలం పాట నిర్వహించనున్నట్లు వివరించారు.
బీజేపీ నేతలే కీలకం
పెద్దపల్లి: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బీజేపీకి చెందిన బీఎల్నేలు కీలక బాధ్యతలు నిర్వహించాలని ఆ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్, సర్ కన్వీనర్ ఆంటోనిరెడ్డి కోరారు. సుల్తానాబాద్ ఎస్ఆర్ గార్డెన్స్లో ఆ పార్టీ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన బీఎల్ఏల సమావేశంలో మాట్లాడారు. ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైనవారి పేర్లు నమోదు చేయించడం, తప్పులను సరిచేయించడం, ప్రజలకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించడం వంటి బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలన్నారు. సర్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ గొట్టిముక్కుల సురేశ్రెడ్డి, నాయకులు బెజ్జంకి దిలీప్కుమార్, సౌదరి మహేందర్ యాదవ్, కాసాగోని నిర్మలగౌడ్, కామని రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
నివేదిక తెప్పించాలి
పెద్దపల్లి: పీఆర్సీ–2023 కమిటీ నివేదికను తెప్పించి అమలు చేయాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైద్యుల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. డీటీఎఫ్ జిల్లా శాఖ ఐదో వార్షిక కౌన్సిల్ సమావేశం ఆదివారం జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు మల్కా రామకృష్ణారావు అధ్యక్షతన జరిగింది. డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పిడి సంతోష్రెడ్డి.. ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాలు, విద్యారంగ సమస్యలపై నివేదికను కౌన్సిల్ ముందుంచారు. రాజిరెడ్డి మాట్లాడుతూ, రెండో పీఆర్సీ అమలుకు కమిటీ ఏర్పాటు చేసి మూడేళ్లు గడుస్తున్నా ఇంకా తెప్పించలేదన్నారు. ప్రతినిధులు తిరుపతి, శంషోద్దీన్, ప్రసుమతి, కిరణ్కుమార్, రాజు, మల్లేశ్వర్రావు, రాజయ్య పాల్గొన్నారు.


