పెద్దపల్లి: రాష్ట్రవ్యాప్తంగా జూలై 1న నిర్వహించతలపెట్టిన కలెక్టరేట్ల ముట్టడిని జయప్రదం చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పెద్దపల్లిలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చామని తెలిపారు. కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. అనంతరం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై మండల అధ్యక్షుడు రమేశ్ వినతిపత్రం ఇవ్వగా.. త్వరలోనే ఈ విషయమై మంత్రులతో చర్చించి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, జిల్లా కార్యవర్గ సభ్యుడు కడారి సునీల్, మార్కాపూర్ సూర్య, రమేష్, నవీన్, రవి, విఠల్ పాల్గొన్నారు.


