కోల్సిటీ(రామగుండం): మహిళలు, చిన్నారులపై హింస, వేధింపులు, దుర్వినియోగానికి గురైన బాధితులకు సమగ్ర రక్షణ, పునరావాస సేవలు సమర్థవంతంగా అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. శనివారం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. బాధితులకు ఒకే వేదికపై కౌన్సెలింగ్, తదితర సేవలు అందించడంలో భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ప్రతీ ఫిర్యాదుపై తక్షణ స్పందన అవసరమని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నతాధికారులను, అవసరమైతే పోలీస్ కమిషనర్ను నేరుగా సంప్రదించాలని సూచించారు. బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనపు డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, పెద్దపల్లి, మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు రమేశ్బాబు, సత్యనారాయణ, షీటీం ఎస్సైలు హైమా, ఉషారాణి, శైలజ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కమిషనర్ గ్రీవెన్స్
రామగుండం కమిషనరేట్కు చెందిన అధికారులు, సిబ్బంది శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి సీపీ అంబర్ కిషోర్ ఝా శనివారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బదిలీలు, తదితర అంశాలకు సంబంధించి సిబ్బంది నుంచి అందిన వినతిపత్రాలను పరిశీలించారు. చట్టపరిధిలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కమిషనరేట్ యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని కమిషనర్ తెలిపారు.


