● సింగరేణి కార్మికులను కలుసుకునేందుకు వస్తే నిర్బంధమా? ● బాయిబాట కార్యక్రమంలో టీఆర్ఎస్ అధినేత కవిత
కోల్సిటీ: సింగరేణి కార్మికులను కలిసేందుకు వస్తే గేట్లు మూసివేసి పోలీసులతో అడ్డుకోవడం దురదృష్టకరమని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధినేత కవిత విమర్శించారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం జీడీకే –11, సింగరేణి ఏరియా ఆస్పత్రిలో పర్యటించిన ఆమె.. కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడు తూ, ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు కూడా కార్మికులతో సమావేశాలు నిర్వహించలేదా అని ప్రశ్నించారు. గ్లౌస్లు, షూస్, యంత్రాలు, భద్రత సామగ్రి, తాగునీరు, గాలి వంటి కనీస సౌకర్యాలు కూడా అందించడం లేదని ఆరోపించారు.
20ఏళ్లుగా కార్మికుల కోసం పనిచేస్తున్నా
తాను 20 ఏళ్లుగా సింగరేణి కార్మికులతో కలిసి పనిచేస్తున్నానని కవిత అన్నారు. డిపెండెంట్ ఉద్యోగా ల కోసం పోరాడి 19 వేల ఉద్యోగాలు రావడానికి కృషి చేశానని, మహిళలకు కూడా ఉద్యోగ అవకాశా లు కల్పించామని తెలిపారు. కార్మికుల హక్కుల కో సం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ పోరాటం చేస్తాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణికి మరిన్ని బొగ్గు బ్లాకులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఓపెన్కాస్ట్ల కంటే అండర్గ్రౌండ్ మైనింగ్ వల్ల పర్యావరణ పరిరక్షణతోపాటు వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ఆమె పేర్కొన్నారు. సింగరేణి ఏరియా ఆస్పత్రిలో గాంధీ, ఉస్మానియా స్థాయి వైద్య సదుపాయాలు ఉండాలని కవిత అన్నారు. సింగరేణి కాలనీల్లో డ్రైనేజీ నీరు తాగునీటిలో కలుస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని కవిత ఆరోపించారు. రూ.20 కోట్లతో చేపట్టిన ర్యాపిడ్ ఫిల్టర్ బెడ్ పనులను కవిత పరిశీలించారు.
ఆటోలో ప్రయాణం
గోదావరిఖనిటౌన్: టీఆర్ఎస్ అధినేత కవిత ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ ఆటోలో సింగరేణి ఆస్పత్రి నుంచి హెచ్ఎంఎస్ కార్యాల యం వరకు ప్రయాణించారు. ఆటోడ్రైవర్ల సమస్యల గురించి ఆయనను అడిగి తెలుసుకున్నారు.


