కోల్సిటీ(రామగుండం): ఫుడ్ పాయిజన్కు గురైన సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సిమ్స్)కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థుల్లో అక్యూట్ గ్యాస్ట్రోఎంటెరిటిస్(ఏజీఈ) లక్షణాలు కనిపించడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. బాధిత విద్యార్థులు ఇంకా కోలుకోకపోవడంతో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్వో) కె. ప్రమోద్కుమార్ నేరుగా జీజీహెచ్ను సందర్శించారు. బాధిత విద్యార్థులను ప్రత్యక్షంగా కలిసి వారి ఆరోగ్య పరిస్థితి, ఆహారం తీసుకున్న సమయం, అస్వస్థతకు గురైన పరిస్థితులపై వివరాలు సేకరించారు. విధుల్లో ఉన్న వైద్యులతో మాట్లాడి ఇప్పటివరకు అందించిన వైద్య సేవల వివరాలను తెలుసుకున్నారు. అవసరమైన అన్ని వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆహార కలుషితంపై అనుమానాల నేపథ్యంలో సంబంధిత అంశాలపై విచారణ కొనసాగుతోందని, విద్యార్థులపై నిరంతర వైద్య పర్యవేక్షణ కొనసాగుతోందని, ముగ్గురు విద్యార్థులు మాత్రమే చికిత్స పొందుతున్నారని, మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని డీఎంహెచ్వో తెలిపారు. విద్యార్థుల్లో అక్యూట్ గ్యాస్ట్రోఎంటెరిటీస్(ఏజీఈ) లక్షణాలు కనిపిస్తున్నాయని అన్నారు. అక్యూట్ గ్యాస్ట్రోఎంటెరిటీస్(ఏజీఈ) లక్షణాలు అంటే కడుపు, ప్రేగుల్లో వచ్చే సమస్యలని, దీంతో కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు, నీరసం ఉంటాయని డీఎంహెచ్వో వివరించారు. ఇప్పటికే బాధిత విద్యార్థుల నుంచి సేకరించిన రక్తనమూనాలను పరీక్షల కోసం పంపించామని, ఇంకా కొన్ని నివేదికలు రావాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శ్రీరాములు, జిల్లా ఎపిడెమియాలజిస్ట్ నరేశ్, హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.


