రామగుండం మేయర్ మహంకాళి స్వామి పారిశుధ్య నిర్వహణకు పకడ్బందీ చర్యలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన 56వ డివిజన్లో బల్దియా యంత్రాంగం వార్డు సందర్శన
కోల్సిటీ: బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా విధించాలని రామగుండం మేయర్ మహంకాళి స్వామి సూచించారు. నగరంలోని 56వ డివిజన్లో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ కొమ్ము స్వప్న– వేణుతో కలిసి శనివారం ఆయన పర్యటించారు. మేయర్ మాట్లాడుతూ, ఇళ్లనుంచి వెలువడే చెత్తే కాలువల్లో ఎక్కువగా కనిపిస్తోందని, పరుపులు, టైర్లు, ఇతర వస్తువులు కూడా పడవేస్తుండడంతో మురుగునీరు సాఫీగా వెళ్లడం లేదన్నారు. తద్వారా వర్షాకాలంలో నివాసాల్లోకి వరద వస్తోందని, లోతట్టు ప్రాంతాల్లో వరద ముప్పు నివారించడానికి రూ.కోట్లు ఖర్చు పెట్టి డ్రెయిన్లు నిర్మిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోందని తెలిపారు. చెత్త బయట పడవేయకుండా మెప్మా ఆర్పీలు, స్వశక్తి మహిళలు ఇంటింటా అవగాహన కల్పించాలని కోరారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా తిలక్నగర్లోని మేజర్ నాలాలో పూడిక తొలగించారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ టీపీఎస్ నవీన్, సూపర్వైజర్ సంపత్, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
యైటింక్లయిన్కాలనీ: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. సింగరేణి ఎన్సీవోఏ క్లబ్లో నిర్వహించిన క్లస్టర్స్థాయి ప్రత్యేక వార్డు సభ్యుల సమావేశంలో డిప్యూటి మేయర్ పాతిపెల్లి ఎల్లయ్యతో కలిసి మాట్లాడారు. వర్షాకాలంలో రోడ్లపై నీటినిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతీడివిజన్లో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేయాలన్నారు. ఏమెనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్సొరేటర్లు, క్లస్టర్లు, మున్సిపల్ అధికారులు, వార్డు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.


