● లారీని అడ్డుకున్న గ్రామస్తులు
● పోలీసు లాఠీచార్జి చేశారని ఆరోపణ
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామంలో బుధవారం రాత్రి మట్టి తరలించే టిప్పర్ ఢీకొనడంతో విద్యుత్ స్తంభం విరిగింది. సమాచారం అందుకున్న సర్పంచ్ భర్త ఆకుల శ్రీనివాస్తోపాటు కొందరు గ్రామస్తులు టిప్పర్ను అడ్డుకున్నారు. స్తంభాన్ని ఢీకొట్టి ఆపకుండా ఎందుకు వెళ్తున్నావని డ్రైవర్ను నిలదీశారు. ఈక్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగింది. దీంతో కొందరు టిప్పర్ అద్దాలు పగులగొట్టారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్సై మల్లేశ్, సీఐ ప్రవీణ్కుమార్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నించారు. మరోవైపు.. ప్రతీరోజు ఇలాగే ఇబ్బందులను సృష్టిస్తున్నారని పోలీసులు తమపై లాఠీచార్జి చేశారని ఆకుల శ్రావణ్, కందుల శ్రీనివాస్ తదితరులు ఆరోపించారు. కాగా, రోడ్లపై లారీలను ఆపి అద్దాలు పగులగొట్టిన పలువురిపై కేసు నమోదు చేసినట్టు సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు.


