పెద్దపల్లి: భవిష్యత్ సాంకేతిక ఆధారిత ప్రపంచంగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా ఆధునిక సాంకేతిక విద్యలో ముందుండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఏఐ, రోబోటిక్స్ స్టూడెంట్ ఫోకస్ 2026లో మాట్లాడారు. ఏప్రిల్ 27నుంచి ఈనెల 26వరకు జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం, సుల్తానాబాద్లలో టీఫైబర్ సహకారంతో ప్రత్యేక శిక్షణ అందించినట్లు తెలిపారు. విద్యార్థుల్లో సాంకేతిక పరి జ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటి క్స్ డిజిటల్ నైపుణ్యాల అభివృద్ధికి నిర్వహించిన ఈ శిక్షణ దోహదపడిందన్నారు.ఉత్తమ ప్రతిభకనబర్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. జిల్లా పరిపాలన, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వరికొయ్యలను కాల్చొద్దు
కమాన్పూర్(మంథని): వరికోతల అనంతరం పంట పొలాల్లో వరికొయ్యలను కాల్చొద్దని జిల్లా వ్యవసాయాధికారి బత్తిన శ్రీనివాస్ అన్నారు. కమాన్పూర్ మండలం గుండారం రైతు వేదికలో మంగళవారం పంట సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. వరికొయ్యలు కాల్చడం వల్ల సేంద్రియ కర్బనం గాలిలో కలుషితవాయువుగా మారిపోతుందన్నారు. వరికొయ్యలను రోటోవేటర్తో దుక్కిదున్నించి నీరు పెట్టి పచ్చిరొట్టె విత్తనాలు చల్లుకుంటే పంట దిగుబడి పెంచుకోవచ్చని సూచించారు. ఏడీఏ అంజని, ఏవో రామకృష్ణ, ఏఈవో అనూష, మాజీ సర్పంచులు ఆకుల ఓదెలు, కట్కం రవీందర్ పాల్గొన్నారు.
31వరకు ఉపకార వేతనాల దరఖాస్తు గడువు
పెద్దపల్లి: ఉపకార వేతనాల దరఖాస్తు గడువు ఈనెల 31వరకు పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న అర్హులైన ఎస్సీ విద్యార్థులు 2025–26 సంవత్సరానికి ప్రభుత్వం అందించే ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 8790153484 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు.
31న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
పెద్దపల్లి/జ్యోతినగర్: సుల్తానాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈనెల 31న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కొమ్ము గట్టయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ 16, 18, 20 విభాగాల్లో బాలబాలికలు, మహిళలు, పురుషులకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు సంబంధిత ధ్రువపత్రాలతో ఉదయం 6గంటలకు క్రీడామైదానంకు రావాలని కోరారు. పూర్తి వివరాలకు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రణయ్(96183 36976)ని సంప్రదించాలని పేర్కొన్నారు.
కాంటా లేక
తూకంలో జాప్యం
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో మంగళవారం తూకం వేసే కాంటాలు పనిచేయక కొద్దిగంటల పాటు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న అధికారులు సుల్తాబాద్ మార్కెట్ యార్డు నుంచి రెండు కాంటాలు తెప్పించి కొనుగోళ్లను ప్రారంభించారు. జిల్లా కేంద్రమైన పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో ఎలక్ట్రానిక్ కాంటాలకు మరమ్మతు చేయించి తూకంలో వేగం పెంచేలా చూడాలని రైతులు కోరుతున్నారు.


