కరీంనగర్స్పోర్ట్స్: తెలంగాణలో కిక్ బాక్సింగ్ పేరిట పలువురు క్రీడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, అవి అన్ని బోగస్ క్రీడాసంఘాలని తెలంగాణ కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు పేర్కొన్నారు. కరీంనగర్లో ఆదివారం మాట్లాడుతూ ఏదైనా క్రీడా సంఘం ఏర్పాటైతే అది తెలంగాణ ఒలంపిక్ సంఘం, జాతీయ ఫెడరేషన్, భారత ప్రభుత్వం గుర్తింపు పొంది ఉండాలన్నారు. రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ కిక్బాక్సింగ్ అసోసియేషన్ మాత్రమే గుర్తింపు ఉందని ఈ సంఘం ఆధ్వర్యంలోనే ఏటా రెండుసార్లు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించి, జాతీయ పోటీలకు తెలంగాణ జట్లను పంపిస్తున్నట్లు తెలిపారు. కొందరు మోసపూరితంగా సంఘాలను ఏర్పాటు చేసుకొని తల్లిదండ్రులను, పాఠశాలల యాజమాన్యాలను తప్పుదోవపట్టిస్తున్నారని వాటన్నింటని నమ్మవద్దని హితవు పలికారు. తెలంగాణ కిక్ బాక్సింగ్ ఆధ్వర్యంలో జారీ చేసిన క్రీడా సర్టిఫికెట్లలకు ట్రిపుల్ఐటీ, ఎంసెట్ తదితర ఉన్నత విద్యకు స్పోర్ట్స్ కోటా వర్తిస్తుందన్నారు. తెలంగాణలో 25 జిల్లాల్లో కిక్ బాక్సింగ్ సంఘాలున్నాయని, ఇవన్ని ఒలంపిక్ సంఘంలో గుర్తింపుపొందాయని తెలిపారు. అనధికార సంస్థలు లేదా టోర్నమెంట్లు నిర్వహిస్తున్న వారు మానుకోవాలని హెచ్చరించారు. బోగస్ లేదా అనధికార సంస్థలు నిర్వహించే ఈవెంట్స్లో పాల్గొంటే అందులో పొందిన సర్టిఫికెట్లు చెల్లుబాటు కావని సూచించారు. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల కిక్ బాక్సింగ్ సంఘాల కార్యదర్శులు, కోచ్లు సురభి అన్వేష్, వి.శ్రీనివాస్, సురభి ఇంద్ర, ఎ.సంజీవ్, ఎస్.వినీశ్, కె.వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ కిక్ బాక్సింగ్ సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు


