నల్లబడుతున్న మామిడిపూత
రూ.లక్షల్లో పెట్టుబడి..
ధర్మారం: ప్రతికూల వాతావరణం మామిడి రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. విపరీతమైన పూత రావడం, రాలిపోవడం, మళ్లీ వస్తుండటంతో దిగుబడిపై బెంగ పట్టుకుంది. పెద్దపల్లి జిల్లాలోనే అత్యధికంగా ధర్మారం మండలంలో దాదాపు 4,650 ఎకరాల విస్తీర్ణంలో మామిడితోటలు ఉన్నాయి. కొందరు రైతులు ఇతర పంటలకు స్వస్తిచెప్పి మామిడితోటలపైనే ఆధారపడుతున్నారు.
రెండు దశాబ్దాల క్రితమే గిట్టుబాటు..
రెండు దశబ్దాల క్రితం మామిడి రైతులకు ఆశించిన మేర దిగుబడి వచ్చింది. గిట్టుబాటు ధర లభిచింది. మామిడిసాగుకు అనుకూలమైన ఎర్ర నేలలు ఉండటంతో రైతులు దీనిపైనే ఆసక్తి కనబర్చారు. అయితే, ఐదేళ్లుగా అనుకూలమైన వాతావరణం ఉండడంలేదు. రైతులు ఏటా రూ.లక్షల్లో నష్టాలు చవిచూస్తున్నారు. ఈ ఏడాది కూడా పూత ముందుగా.. డిసెంబర్లోనే వచ్చి రైతులకు ఆశలు కల్పించాయి. కానీ, ఇప్పుడు పూతనల్లగా మారి వారికి కన్నీళ్లు మిగిల్చాయి. మళ్లీ కొంత కొంత పూత వచ్చినా.. గెలపెట్టకుండా మధ్యలోనే ఆగిపోతోంది. ఫిబ్రవరిలో పిందె, కాయదశకు రావాల్సి ఉంది. కొన్నిచోట్ల పూతదశ, మరికొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే పిందె వస్తోంది. ఇవి కూడా రాలిపోతున్నాయి.
దిగుబడిపై అన్నదాతల్లో ఆందోళన
వాతావరణంలో మార్పులే కారణమంటున్న శాస్త్రవేత్తలు
ప్రతికూల వాతావరణంతో తొలుత వచ్చిన మామిడిపూత రాలిపోవడం, మళ్లీ ఆలస్యంగా వచ్చినా నిలుస్తుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తేనేమంచుపురుగు, ట్రిప్స్, గొంగళి పురుగు ఆశించి పంటను దెబ్బతీస్తాయనిసే రైతులు వాపోతున్నారు. చీడపీడల నివారణ మందుల కోసం ఇప్పటికే ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.30వేల వరకు వెచ్చించారు. మరోవైపు.. పండుదశలో ఈగ వచ్చే ప్రమాదం పొంచి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్లో మార్కెట్లోకి రావాల్సిన మామిడి ఈసారి ఆలస్యం అయ్యే అవకాశం ఉండగా.. జూన్, జూలైలో ఈదురుగాలులు, వర్షాలతో నష్టం తప్పదని భావిస్తున్నారు. ధరలు కూడా పడిపోయి మరింత నష్టం వస్తుందని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ మామిడి పరిస్థితి ఇలాగే ఉందని ఉద్యాన అధికారులు చెబుతున్నారు.
నల్లబడుతున్న మామిడిపూత


