రేగు పండ్ల కోసం వెళ్లి..
● బావిలో పడి విద్యార్థి మృతి
వీణవంక: రేగు పండ్లు తెంపుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ విద్యార్థి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఈర్నాల శ్రీనివాస్–శారద దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు రాజు(11) ఉన్నారు. రాజు స్థానిక పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాడు. మంగళవారం తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లగా.. గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద రేగు పండ్ల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడ్డాడు. పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు రాజు కనిపించకపోవడంతో.. రాజు కోసం వెతికారు. కొలిపాక శ్రీనివాస్ అనే వ్యక్తి బావిలో అదే రోజు అర్ధరాత్రి శవమై కనిపించాడు. విద్యుత్ మోటార్ల సాయంతో బుధవారం వెలికితీశారు. మృతుడి తల్లి శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి విద్యార్థి దహన సంస్కారాలకు రూ.10వేలు అందజేశారు.


