ప్రలోభాల జాతర
చివరిరోజు జోరుగా ప్రచారం
గడువు ముగియగానే పంపకాలు
ఓటర్లకు నేరుగా డబ్బు చేరేలా ప్రణాళికలు
వార్డుపెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు
సాక్షి పెద్దపల్లి: ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది మొదలు మైకుల మోతలు.. ప్రచార వాహనాల చక్కర్లు.. కార్నర్ మీటింగులు.. బైక్ర్యాలీల హోరు.. రోజూ నిద్రలేచింది మొదలు.. పొద్దుగూకే వరకూ విరామం లేకుండా ఇంటింటికీ వెళ్లి ఓటర్ల దరిచేరిన అభ్యర్థనలు ఎట్టకేలకు సోమవారం మగిశాయి. ప్రచారానికి తెరపడింది. మైకులు మూగబోయాయి. ప్రలోభాల పర్వం ఊపందుకుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఒక్కోఅభ్యర్థి ఒక్కో ప్రయత్నం.. ఎలాగైనా విజయం సాధించాలనే తాపత్రయం. ఎంతఖర్చు అయినా ఓట్లు తమకే పడాలని, కౌన్సిలర్/కార్పొరేట్గా ప్రమాణస్వీకారం చేయాలని, చివరిరోజు జోరుప్రచారం చేసిన అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీశారు. ఇకఓట్లు వేసే సమయమే మిగిలిఉంది.
బలప్రదర్శనతో ముగింపు
చివరిరోజు అన్ని పార్టీల అభ్యర్థులు సాధ్యమైనంత ఎక్కువమంది కార్యకర్తలతో బలప్రదర్శన చేశారు. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున మంత్రిశ్రీధర్బాబు, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్సింగ్, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, బీజేపీ అభ్యర్థులకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్కు మాజీ ఎమ్మెల్యేలు కో రుకంటి చందర్, పుట్ట మధు, దాసరి మనోహర్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మిగిలిన అభ్య ర్థులు సొంతంగానే ఓట్లు కోసం ప్రచారం చేశారు.
ఫలితాలు తారుమారయ్యేది ఇప్పుడే..
ఎన్నికల క్రతువులో కీలకంగా భావించే కొన్నిగంటల్లోనే ఫలితాల్ని తారుమారు చేసేందుకు కొందరు అభ్యర్థులు తెరవెనుక రాయ్ఙబేరాలుశ్రీ సాగిస్తున్నారు. డబ్బు, మద్యం.. ఇలా ఏదైనా సరే.. సింగిల్గానైనా.. ఫ్యామిలీ ప్యాకేజీగానైనా ఓకే.. కానీఓట్లు తప్పకుండా తమకే అంటూ తాయిలాలు ఎరవేస్తున్నారు. ఇప్పటికే ప్రచార పర్వంలో ఖర్చు తడిసి మోపైడెనా.. పోలింగ్కు ముందు కీలకమైన ఈ సమయంలోనే వెచ్పించే డబ్బులే ఫలితాన్ని నిర్ణయిస్తాయని అభ్యర్థులు చెబుతున్నారు.
ఒక్కోవార్డులో ఒక్కోలా..
ఈ రెండురోజుల్లో కొందరు ఎంతలేదన్నా ఇప్పటివరకు ఖర్చుచేసిన దానికి అదనంగా రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. రిజర్వుడ్ స్థానాల్లోనూ ఖర్చుకు వెనకాడడం లేదంటున్నారు. ప్రత్యర్థి ఓటుకు ఎంత ఇస్తున్నాడని ఆరా తీస్తూ, దానికి అదనంగా పంచేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దాదాపుగా అన్ని బల్దియాల్లో ఓటుకు తక్కువలో తక్కువగా రూ.1,500 నుంచి రూ.3,000 వరకు పంచేందుకు కొందరు సిద్ధమయ్యారు. పోటాపోటీ డివిజన్లు/వార్డులు, చైర్మన్ అభ్యర్థులు పోటీచేస్తున్న ప్రాంతాల్లో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5వేల వరకూ పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
డిజిటల్ పేమెంట్స్రూపంలోనే..
ఇంటింటికీ తిరిగి పంపిణీ చేయడం రిస్క్తో కూడున్నది కావడంతో కొందరు అభ్యర్థులు అనుచరుల ద్వారా గూగుల్, ఫోన్పే, పేటీఎంతో ఓటర్లకు నేరుగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. దీనిద్వారా ఓటరుకు నేరుగా డబ్బు చేరడంతోపాటు, రిస్క్ తక్కువని భావిస్తున్నారు. మరికొందరు అభ్యర్థులు.. కుటుంబంలో 5 ఓట్లకుపైగా ఉంటే వారికి నేరుగా మొబైల్ ఫోన్స్, వెండికాయిన్లు పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం చీటీలు రాసి సమీప షోరూంలో వాటిని తీసుకోవాలని ఆఫర్ చేస్తున్నారు. నేరుగా డబ్బులు పంపిణీ చేశాక వారితో ప్రమాణం చేయించుకుంటూ ఓటును ఖరారు చేసుకుంటున్నారు.
ముగిసిన ప్రచార ఘట్టం
మున్సిపల్లో పోటాపోటీ..
మంథని: మంథనిలోని 13 వార్డుల్లో 48 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున మంత్రి శ్రీధర్బాబు ఇంటింటా ప్రచారం, ర్యాలీ, రోడ్డుషోలు నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ప్రచారం చేశారు. ప్రచారం గడువు ముగియడంతో మైక్ల మోతలు, డప్పుచప్పుళ్లు ఆగిపోయాయి. రాత్రి సమయాల్లో ఓటర్లకు మద్యం పంచేందుకు కొందరు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంటికి రూ.2వేల నుంచి రూ.3వేలు, మద్యం, చీర, ఇతరత్రా విలువైన వస్తుసామగ్రి పంచి ఓటరును ఆకర్షించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.
ప్రలోభాల జాతర


