శాంతిభద్రతల పరిరక్షణకు ‘బ్లూ కోల్ట్’
● ఏఎస్పీ మనీషారెడ్డి
పార్వతీపురం రూరల్: పట్టణంలో నేరాల నియంత్రణ, తక్షణ పోలీస్ సేవలే లక్ష్యంగా పార్వతీపురం ఏఎస్పీ మనీషారెడ్డి ’బ్లూ కోల్ట్’ వాహనాలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డయల్ 100, 112కు వచ్చే ఫిర్యాదులపై ఈ వాహన సిబ్బంది స్పందిస్తారని తెలిపారు. అనంతరం ఆటో డ్రైవర్లు, యజమానులతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని సూచించారు. మహిళలు, చిన్నారుల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ వెంకటరావు, ఎస్సైలు గోవింద్, పాపారావు, తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో దొంగ
విజయనగరం క్రైమ్: ఉత్తరాంధ్రలో పేరుమోసిన దొంగ కర్రి సతీష్ను విజయనగరం క్రైమ్ పార్టీ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఐజీ ఆదేశాల మేరకు ఎస్పీ సూచనలతో క్రైమ్ పార్టీ ఎస్సై సురేంద్రనాయుడు, తదితరులు ఒడిశాలోని భువనేశ్వర్ వెళ్లి అక్కడి పోలీసుల అదుపులో ఉన్న సతీష్ను విజయనగరం తీసుకువచ్చారు. గాజువాకకు చెందిన సతీష్ గతంలో విజయనగరంలో పెద్ద పెద్ద దొంగతనాలు చేశాడు. ఏపీతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో చోరీలకు పాల్పడుతూ.. పోలీసులకు తలనొప్పిగా మారాడు. అయితే ఒడిశాలోని పోలీసులకు ఇటీవల పట్టుబడడంతో, స్థానికంగా నమోదైన కేసులకు సంబంధించి విజయనగరం పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
బంగారు వ్యాపారులు
విజయనగరం క్రైమ్ పార్టీ పోలీసులు పట్టణానికి చెందిన బంగారు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. బంగారం అమ్మకం, కొనుగోలులో జరిగిన లావాదేవీల వ్యవహారంలో కొంతమంది వన్టౌన్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. దీంతో వారిని ప్రశ్నించేందుకు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సురేంద్రనాయుడు తెలిపారు.
పీఏసీఎస్ ఉద్యోగుల
పోరాటం న్యాయమైనదే..
● సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రెడ్డి శంకరరావు
విజయనగరం గంటస్తంభం: పీఏసీఎస్ ఉద్యోగులు 75 రోజులుగా కొనసాగిస్తున్న పోరాటం న్యాయమైనదేనని, వారి డిమాండ్ల సాధనకు సీపీఎం మద్దతు ఉంటుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్మి వర్గ సభ్యుడు రెడ్డి శంకరరావు తెలిపారు. జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 వేల మంది పీఏసీఎస్ ఉద్యోగులు రెండు వందలకు పైగా బ్రాంచ్లలో ఆందోళనలు నిర్వహిస్తున్నప్పటికీ, ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆందోళనకరమన్నారు. కనీసం చర్చలకు కూడా ముందుకు రాకపోవడం సరికాదని హితవు పలికారు. 2019 తర్వాత నియమితులైన ఉద్యోగులను పర్మినెంట్ చేయడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
సంఘాల బలోపేతానికి సమర్థవంతమైన నాయకత్వం అవసరం
విజయనగరం ఫోర్ట్: మహిళా సంఘాల బలోపేతానికి సమర్థవంతమైన నాయకత్వం అవసరమని డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి అన్నారు. స్థానిక టీటీడీసీలో జిల్లా సమాఖ్య కార్యవర్గ సభ్యులకు నాయకత్వం, పాలనపై ఇస్తున్న రెండు రోజుల శిక్షణకు ఆయన శనివారం హాజరై సూచనలు చేశారు. కార్యవర్గ సభ్యులు తమ బాధ్యతలు స్పష్టంగా అర్థం చేసుకుని, సమావేశాలను క్రమబద్ధంగా నిర్వహిస్తూ ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత పాటించాలని తెలిపారు. జిల్లా సమాఖ్య స్థాయిలో తీసుకున్న ప్రతి నిర్ణయం సభ్యుల భాగస్వామ్యంతో ఉండాలని, జవాబుదారీతనం, సమానత్వం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా సంఘాల అభివృద్ధి ద్వారా గ్రామీణ కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు సంచాలకులు కె.సావిత్రి, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఎ. చిరంజీవి, ఏపీఎం విశ్వేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు ‘బ్లూ కోల్ట్’
శాంతిభద్రతల పరిరక్షణకు ‘బ్లూ కోల్ట్’


