రారండోయ్.. అమ్మ జాతర చూసొద్దాం..
● సంబరానికి సిద్ధం
● నేడు పోలమాంబ సిరిమానోత్సవం
● పూర్తికావచ్చిన ఏర్పాట్లు
మక్కువ: ఉత్తరాంధ్ర ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి సిరిమాను సంబరం మంగళవారం జరగనుంది. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను దేవాదాయశాఖ ఆధ్వర్యంలో సిద్ధం చేశారు. జాతరకు ఇతర జిల్లాలతోపాటు. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు, జిల్లా నలుమూలల నుంచి సుమారు 3లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే అవకాశముందని అధికారులు అంచనావేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి సిరిమాను, సిరిమాను బండిని సిద్ధం చేశారు. మంగళవారం మధ్యాహ్నం సుమారు 3గంటల ప్రాంతంలో పూజారి జన్నిపేకాపు భాస్కరరావు సిరిమానును అధిరోహించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. గ్రామానికి సర్కస్లు, వినోదకార్యక్రమాలు చేరుకున్నాయి.
జాతర బందోబస్తు వివరించిన అడిషనల్ ఎస్పీ
జాతరలో పోలీసులు ఎక్కడెక్కడ విధులు నిర్వహించాలో సిబ్బందికి అడిషనల్ ఎస్పీ మహేశ్వరరావు, ఏఎస్పీ వి.మనీషారెడ్డి సూచించారు. జాతరకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడకుండా విధులు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పనిచేయాలని చెప్పారు. సీసీకెమెరాలు ముఖ్యమైన ప్రదేశాలలో ఏర్పాటుచేసినట్లు తెలిపారు. పోలీస్ కంట్రోల్రూమ్ నుంచి జాతర పర్యవేక్షించనున్నట్లు వివరించారు.
దేవాదాయశాఖ ఏర్పాట్లుపూర్తి
దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ పర్యవేక్షణలో ఆలయ ఈవో బి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధానాలయం, వనంగుడి వద్ద ఉచితం, రూ.20, రూ.100 టికెట్ ద్వారా భక్తులు దర్శనం చేసుకునేందుకు క్యూలు ఏర్పాటుచేశారు. భక్తులుకు ఎండ తగలకుండా ఉండేందుకు క్యూల పైన పెండాల్స్, తాటాకుల పందిరి ఏ ర్పాటు చేశారు. క్యూల వద్ద చిన్నపిల్లలుకు అందించే విధంగా 50లీటర్ల పాలు ఏర్పాటుచేశారు. అలాగే 20వేల లడ్డూప్రసాదాన్ని తయారుచేశారు. భక్తులకు అవసరమైనంత వీలుగా పులిహోర ప్రసాదాన్ని తయారుచేయించారు. గ్రామంలోని వనంగుడి, చదురుగుడి క్యూల పక్కన, అవుట్గేట్ వద్ద, వైఎస్సార్ విగ్రహం వద్ద ప్రసాదం విక్రయా నికి నాలుగుచోట్ల కౌంటర్లు ఏర్పాటు చేశారు.
మరుగుదొడ్ల ఏర్పాటు
వచ్చిన భక్తులు కాలకత్యాలను తీర్చుకునేందుకు వీలుగా శాశ్వత మరుగుదొడ్లు 56, బయోటాయిలెట్లు 18 ఏర్పాటుచేశారు. రెండు చోట్ల మహిళల వస్త్ర మార్పిడి గదులు ఏర్పాటుచేశారు. కూల వద్ద తాగునీటి సౌకర్యం కల్పించారు.
683మంది పోలీసుల బందోబస్తు
భక్తులు ఇబ్బందులు పడకుండా 683మంది పోలీసులు ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిహించనున్నారు. ముగ్గురు డీఎస్పీలతోపాటు, 17మంది సీఐలు, 48మంది ఎస్సైలు, ఏఎస్సైలు,హెచ్సీలు, కానిస్టేబుల్స్, మహిళాపోలీసులు, హోంగార్డులు, ఆర్డ్డ్ ఫోర్స్తో పాటు, ఎస్టీఎఫ్ జాతరలో విదులు నిర్వహించనున్నారు.
ఐదు చోట్ల వైద్యశిబిరాలు
గ్రామంలోని వనంగుడి, క్యూలు, అంగన్వాడీకేంద్రం, పీహెచ్సీ, రామమందిరం వద్ద ఐదు వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. వైద్యశిబిరాల వద్ద ఏడుగురు వైద్యాధికారులతోపాటు, సుమారు 50మంది పారామెడికల్ సిబ్బంది విధులు నిర్వహిస్తారు.
చురుగ్గా పారిశుద్ధ్య పనులుః
జాతరలో 200మంది పారిశుద్ద్య కార్మికులుతో పారిశుద్ద్య పనులు జరిస్తున్నారు. జాతరలో నెలకొన్న పారిశుధ్య లోపాన్ని యుద్ధప్రాతిపదికన తొలగించేందుకు డీపీవో ఎన్.కొండలరావు చర్యలు చేపట్టారు.
అయిదుచోట్ల పార్కింగ్ ఏర్పాటు
శంబర గ్రామానికి చేరుకునే వాహనాలకు ఐదు చోట్ల పార్కింగ్స్థలాలు ఏర్పాటు చేశారు.
జాతరకు 222 బస్సులు
పార్వతీపురం, సాలూరు, విజయనగరం, శ్రీకాకుళం, ఎస్.కోట, పాలకొండ డిపోల నుంచి సుమారు 222బస్సులను జాతర సందర్భంగా ఆర్టీసీ అధికారులు నడుపనున్నారు.
సిరిమాను అధిరోహించడం గొప్ప అదష్టం
సిరిమానును అధిరోహించడం గొప్ప అదష్టమని పూజారి జన్ని పేకాపు భాస్కరరావు, అలియాస్ జగదీశ్వరరావు తెలిపారు. గతేడాది భాస్కరరావు చిన్నాన్న జన్ని పేకాపు రామారావు సిరిమానును అధిరోహించగా, ఈఏడాది సిరిమానును భాస్కరరావు అధిరోహించనున్నారు.
జాతరకు వాహనాల్లో ఇలా చేరుకోవాలి
చినభోగిలి నుంచి మక్కువమీదుగా శంబర,
బొబ్బిలి నుంచి కన్నంపేట, వయా మక్కువ మీదుగా శంబర
సాలూరు నుంచి మామిడిపల్లి మీదుగా శంబర,
సాలూరు నుంచి మావుడి మీదుగా శంబర భక్తులు చేరుకునే విధంగా సీఐ రామకృష్ణ చర్యలు చేపట్టారు.
రారండోయ్.. అమ్మ జాతర చూసొద్దాం..
రారండోయ్.. అమ్మ జాతర చూసొద్దాం..


