
పాఠశాలలో ప్రొజెక్టర్ చోరీ
రామభద్రపురం: మండలకేంద్రంలోని అగురువీధి ప్రాథమిక పాఠశాలలో కయాన్ ప్రొజెక్టర్ చోరీకి గురైంది. ఈ చోరీపై పాఠశాలకు చెందిన ఇద్దరు టీచర్లతో కలిసి హెచ్ఎం బి.తిరుపతిరావు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. హెచ్ఎం తెలిపిన వివరాల ప్రకారం డిజిటల్ తరగతుల నిర్వహణలో భాగంగా 2022లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.1.30 లక్షలు విలువ చేసే కయాన్(ఇంటరాక్టివ్ ప్రాజెక్టర్)అందజేసింది. అయితే పాఠశాలల పునఃప్రారంభం తర్వాత శని,ఆదివారాలు సెలవుల్లో గుర్తు తెలియని దుండగులు తరగతి గది తాళం విరగొట్టి కయాన్ ప్రొజెక్టర్ దొంగతనానికి పాల్పడ్డారు. పాఠశాలకు చెందిన స్కావెంజర్ ఆదివారం ఉదయం తరగతి గదులు పరిశుభ్రం చేయడానికి వెళ్లి తలుపుల తాళం విరగ్గొట్టి ఉండడం ప్రొజెక్టర్ చోరీ జరిగినట్లు గుర్తించి తనకు సమాచారం ఇవ్వగా వెంటనే పాఠశాలకు చేరుకుని పరిశీలించి తోటి టీచర్లతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు పాఠశాలకు చేరుకుని చోరీ జరిగిన తరగతి గదితో పాటు పాఠశాల ఆవరణంతా పరిశీలించారు. ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామని ఎస్సై తెలిపారు.
10 మంది జూదరుల అరెస్ట్
పూసపాటిరేగ: మండలంలోని కొల్లాయివలస సమీపంలో మామిడి తోటలో పేకాట ఆడుతున్న పదిమందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై ఐ.దుర్గాప్రసాద్ తెలియజేశారు. వారి నుంచి రూ.14,210 నగదు, 4 మోటార్ సైకిల్స్, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులను కోర్టుకు తరలిస్తామ న్నారు.
గంజాయి మత్తులో
విద్యార్థిపై దాడి
విజయనగరం క్రైమ్: నగరంలోని కేఎల్పురానికి చెందిన సాగర్ మరోసారి గంజాయి మత్తులో ఆర్కే కళాశాలకు చెందిన విద్యార్థి మహేంద్ర లక్ష్మణ్ కుమార్పై దాడికి పాల్పడ్డాడు. గతంలో కూడా సాగర్ గంజాయి మత్తులో ఇద్దరు విద్యార్థులపై దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బాధిత విద్యార్థి, తల్లిదండ్రులు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వన్టౌన్ సీఐ శ్రీనివాసరావు, క్రైమ్ ఎస్సై సురేంద్రనాయుడు వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
నేలబావిలోపడి మతిస్థిమితంలేని వృద్ధుడి మృతి
రాజాంసిటీ: నేలబావిలో పడి పట్టణ పరిధిలోని గొల్లవీధికి చెందిన బొబ్బిలి లక్ష్మణ (69) అనే మతిస్థిమితంలేని వ్యక్తి మృతిచెందాడు. దీనికి సంబంధించి ఎస్సై వై.రవికిరణ్ సోమవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లక్ష్మణ కొద్ది సంవత్సరాలుగా మతిస్థిమితం కోల్పోయి అప్పుడప్పుడు ఇంటి నుంచి ఒకటి రెండు రోజులు ఎటో వెళ్లిపోయి మళ్లీ వస్తుంటాడు. ఈ క్రమంలోనే ఈ నెల 15న మధ్యాహ్నం భోజనం అనంతరం ఎటో వెళ్లిపోయాడు. రాత్రి సమయం అయినా రాకపోవడంతో కుటుంబసభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. తన భర్త తెలగవీధిలోని శ్మశాన వాటిక వద్ద బావికి స్నానానికి వెళ్తుండేవాడని వృద్ధుడి భార్య నారాయణమ్మ భావించి సోమవారం తెల్ల వారుజామున కుటుంబసభ్యులతో వెళ్లి చూడగా బావి ఒడ్డున లక్ష్మణ చేతికర్ర ఉండడంతో బావిలోకి చూశారు. బావిలో మృతదేహం తేలియాడడంతో పోలీసులకు మృతుని భార్య ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
సామూహిక కుంకుమార్చనలు
విజయనగరం టౌన్: స్థానిక రామానాయుడు రోడ్డులోని శ్రీకోటసత్తెమ్మ ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం సామూహిక కుంకుమార్చనలు చేశారు. అనంతరం లలిత సహస్రనామ పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజు అయిన మంగళవారం పెద్దచెరువులో తెప్పోత్సవం, ఘటాల ఊరేగింపు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

పాఠశాలలో ప్రొజెక్టర్ చోరీ