విద్యుత్ బిల్లులు ఎక్కువగా రావడంతో తల్లికి వందనం రాలేదని వీరఘట్టం ట్రాన్స్కో కార్యాలయం వద్ద ఫిర్యాదు చేస్తున్న తల్లిదండ్రులు
వీరఘట్టం: తల్లికి వందనం పథకం కింద అరకొరగా ప్రభుత్వం పిల్లల చదువుకు నిధులు మంజూరు చేసింది. ఆన్లైన్లో లబ్ధిదారుల వివరాలు తప్పుల తడకగా ఉండడంతో అర్హులైన తల్లులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చేసిన తప్పులు సరి చేయించేందుకు లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తిప్పలు పడుతున్నారు. మండలంలోని 20 సచివాలయాలకు, విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం, ఎంఈవో కార్యాలయానికి లబ్ధిదారులు మంగళవారం క్యూ కట్టడంతో లబ్ధిదారులతో కిక్కిరిసిపోయాయి. తమకెందుకు తల్లికి వందనం వర్తింపజేయలేదని సంబంధిత లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా సచివాలయాల పరిధిలోని వెల్ఫేర్, అడ్మిన్ తదితర సిబ్బందితో వాగ్వాదాలకు దిగుతున్నారు. గతంలో తమకు వర్తించిన ఈ పథకం ఇప్పుడు ఎందుకు వర్తింపజేయలేదని, జాబితాలో అనర్హులమంటూ చూపిన కారణాలు అన్నీ తప్పుల తడకలుగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేని కారణాలు చూపి ఈ పథకం నుంచి తమబోటి అర్హులను తొలగించడం చాలా అన్యాయమని అధికారులను పలుచోట్ల లబ్ధిదారులు మంగళవారం నిలదీశారు.
ఎందుకీ కోతలు....
నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు ఇలా ఇంటిలో ఎంత మంది ఉంటే అందరికీ డబ్బు ఇస్తామని చంద్రబాబునాయుడు అండ్ కో సభ్యులు గత ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు. తీరా అధికారం చేపట్టాక మొదటి ఏడాది తల్లికి వందనం అమలు చేయలేదు. ఏడాది దాటిన తర్వాత కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరికీ రూ.13 వేలు అరకొరగా అందిస్తుండడంపై విద్యార్థుల తల్లులు భగ్గుమంటున్నారు. ఇది పద్ధతి కాదంటూ అధికారులను నిలదీస్తున్నారు. ఈ విషయంపై సచివాలయాల్లో ఫిర్యాదులు చేస్తున్నారు.
ఒక్కరికే..
నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వీరిలో ఒక్కరికి మాత్రమే తల్లికి వందనం పథకం ద్వారా రూ.13 వేలు వచ్చింది. ఇంకో అమ్మాయికి ఎందుకు ఈ పథకం వర్తింపజేయలేదో తెలియడం లేదు. నాలాంటి చాలా మంది తల్లులు డబ్బులు పడక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇంటిలో ఎంత మంది చదువుకుంటే అందరికీ ఈ పథకం వర్తింపజేయాలి.
– బి.రవణమ్మ, విద్యార్థిని తల్లి, వీరఘట్టం
అర్హులకు అందని వైనం
అధికారుల తప్పులు
కార్యాలయాల చుట్టూ లబ్ధిదారుల తిప్పలు
తల్లికి వందనంతో.. తప్పని అవస్థలు..!