
ప్రజలకు ‘కూటమి’ వెన్నుపోటు
పాలకొండ: కూటమి ప్రభుత్వం ప్రజలకు మోసపూరిత పాలనతో ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం కోసం ఇచ్చిన హమీలు అమలు చేయకుండా ప్రజలను మోసగించిన తీరుపై వైఎస్సార్సీపీ తయారు చేసిన పుస్తకాలను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం కోసం కూటమి నాయకులు ప్రజలను మోసగించారని ఆరోపించారు. సూపర్ సిక్స్ పేరుతో హడావుడి చేసి ఏడాది కాలం ఒక్క పథకం కూడా అమలు చేయలేదని తెలిపారు. ఇప్పుడు తల్లికి వందనంలోను అనేక లోపాల కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు భృతి ఎప్పుడు అందిస్తారని ప్రశ్నించారు. ఇంతవరకు రైతులకు కనీసం ఎరువులు అందించలేదని, రైతులకు అవసరమగు వరి విత్తనాలు పంపిణీలోను ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కొత్తగా ఇంతవరకు ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయలేదన్నారు. వైఎస్సార్ సీపీ పాలనకు, కూటమి పాలనకు ఉన్న తేడాను ప్రజలు గమనించాలన్నారు. ప్రజలకు సేవలు అందించే సచివాలయ వ్యవస్థపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టి వాటిని నిర్వీర్యం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. ఏడాదిలోనే కూటమి మోసాలు బయటపడ్డాయన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వెలమల మన్మధరావు, కనపాక సూర్యప్రకాష్రావు, కొట అజయ్కుమార్, కడగల రమణ, తుమ్మగుంట శంకరావు, దుప్పాడ పాపినాయుడు, పాలవలస దవళేశ్వరరావు, కొడెం విజయ్కుమార్, బాసూరు కాంతారావు, నీలాపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ విక్రాంత్
వెన్నుపోటు పుస్తకావిష్కరణ