
జీవన ప్రయాణంలో యోగా దినచర్య కావాలి
మక్కువ: జీవన ప్రయాణంలో యోగా ఒక దిన చర్యగా అలవర్చుకోవాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కలెక్టర్ ఎం.శ్యాంప్రసాద్ కోరారు. మండలంలో శంబర గ్రామం సమీపంలోని వెంగళరాయ సాగర్ ప్రాజెక్ట్ వద్దనున్న ఏనుగుకొండ ప్రాంతంలో మంత్రి సంధ్యారాణి, కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ యోగాంధ్ర కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఈ నెల 21న జరగనున్న యోగా కార్యక్రమంలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయా లని కోరారు. ఏనుగు కొండ ప్రాంతం చాలా మందికి తెలియదని, ఇటువంటి పర్యాటక ప్రాంతంలో యోగాను నిర్వహించుకోవడం వలన ఈ ప్రాంతంలో ఉండే ప్రకృతి అందాలు, ఆహ్లాదకర వాతావరణం ప్రజలకు తెలిసే అవకాశం ఉందన్నారు.
పర్యాటక ప్రాంతంగా ఏనుగులకొండ
కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహించి, వాటిని ప్రమోట్ చేసే దిశగా ఏనుగు కొండ వద్ద యోగా కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ప్రకృతి సోయగాలు, సహజ సిద్ధ అందాలకు నెలవు మన్యం జిల్లా అని, అటువంటి ప్రకతి సోయగాలతో కూడిన ప్రాంతం ఏనుగు కొండ అని కలెక్టర్ తెలిపారు. భవిష్యతులో ఇక్కడ బోటింగ్, ట్రెక్కింగ్ వంటి పలు సదుపాయాలు కల్పిస్తూ, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరిచేందుకు ఈ ప్రాంతం అనుకూలమన్నారు. రోజువారీ కార్యక్రమాల్లో యోగాంధ్ర ఒక భాగం కావాలని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతకు ముందు అధికారులతో కలిసి రంగుల బెలూన్లను గాల్లోకి వదలి యోగాంధ్రకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు కె.రామచంద్రరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్. ఎస్.భాస్కరరావు, ప్రోగ్రాం అధికారి డాక్టర్. టి.జగన్మోహనరావు, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ బి.సుశీల, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారి ఒ.ప్రభాకరరావుతో పాటు అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్