
తహసీల్దార్కు బదిలీ ట్రీట్మెంట్!
సాక్షి, పార్వతీపురం మన్యం:
కొద్ది రోజులుగా పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, మండల తహసీల్దారు మధ్య నెలకొన్న వివాదంలో ఊహించిందే జరిగింది. రాజకీయ ఒత్తిళ్లకు ‘అధికారం‘ తలొగ్గింది. పార్వతీపురం తహసీల్దారు జయలక్ష్మికి బదిలీ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆమెను జియ్యమ్మవలస మండలానికి పంపించా రు. తహసీల్దారును ఇక్కడి నుంచి పంపించేయాల ని అధికారులపై ఒత్తిడి చేసిన టీడీపీ శ్రేణులు.. చివరికి తమ పంతం నెగ్గించుకున్నాయన్న చర్చ ఉద్యోగవర్గాల్లో సాగుతోంది.
ఇదీ వివాదం..
కొద్దిరోజుల కిందట పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర రాత్రి సమయంలో ఫోన్ చేసి, అసభ్య పదజాలంతో తనను దూషించారని తహసీల్దారు జయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఒక లేఖ బయటకు వచ్చిన విషయం విదితమే. దీనిపై తహసీల్దారు నిర్ధారణ చేయనప్పటికీ.. ఎమ్మె ల్యే మాత్రం మీడియా సమావేశం పెట్టి మరీ... సద రు మహిళా అధికారిణిపై విరుచుకుపడ్డారు. ఆమె పెద్ద అవినీతిపరురాలని చెప్పారు. డిజిటల్ సంతకాల కోసం గ్రామస్తుల నుంచి రూ.లక్షల్లో డిమాండ్ చేశారని ఆరోపించారు. మరోసారి ఆమెను కించపరిచేలా, అసభ్యకరంగా మాట్లాడారు. ఆ మరుస టిరోజు పార్వతీపురం తహసీల్దారు కార్యాలయం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తహసీల్దారు జయలక్ష్మికి వ్యతిరేకంగా పలు
వురితో ఫిర్యాదులు చేయించారు. ఆ సమయంలో విచారణకు వచ్చిన సబ్కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ వద్దే నినాదాలు చేశారు. ఆమెను విధుల నుంచి తప్పించాలని, ఇక్కడ నుంచి పంపించేయాలని పట్టుబట్టారు. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదంటూ తూలనాడారు. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టి నివేదిక కలెక్టరుకు అందజేస్తామని అప్పట్లో సబ్ కలెక్టర్ చెప్పారు. నివేదిక వివరాలేవీ బహిర్గత పరచలేదు సరికదా.. తప్పు ఎవరిది తేల్చారో గానీ...
ఎమ్మెల్యేతో వివాదం కేసులో ట్విస్ట్ పంతం నెగ్గించుకున్న టీడీపీ!
తహసీల్దార్ జయలక్ష్మిని తాజాగా జరిగిన బదిలీల్లో జియ్యమ్మవలస మండలానికి పంపించారు. వాస్త వానికి ఆమె పార్వతీపురం మండలానికి వచ్చి ఎన్ని రోజులూ కాలేదు. మధ్యలో కొన్ని నెలలు సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఆ సెలవు వెనుక కారణం కూడా రాజకీయ ఒత్తిళ్లే అన్న విమర్శలు వినిపించా యి. ఇక్కడ చేయలేక, ఆమెనే బదిలీకి దరఖాస్తు చేసుకున్నారా, లేక రాజకీయ కారణాలతో మరోచోటకు పంపించి వేశారా? అన్న చర్చ నడుస్తోంది.
ఇంకేం పని చేయగలం?
కూటమి ప్రభుత్వంలో ఒక మహిళా తహసీల్దారుకు జరిగిన అన్యాయంపై ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. విధుల్లో ఒత్తిడి తీసుకురావడమే కాక.. మాట వినలేదన్న కారణంతో చిన్న విషయాన్ని రాజకీయం చేసి, ఆమెను మరోచోటకు బదిలీ చేయడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా వేధిస్తే ఇంకేం పని చేయగలమని వాపోతున్నారు. ఉన్నతాధికారులు సైతం రాజకీయ నాయకులు చెప్పినట్లే తలాడిస్తున్నారని వాపోతున్నారు.