
జీఆర్పీ, ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్
విజయనగరం క్రైమ్: ఆర్పీఎఫ్ డీజీ ఆదేశాలతో విశాఖపట్నం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో విజయనగరం రైల్వేస్టేషన్లో ఆదివారం కార్టన్ సెర్చ్ జరిగింది. ఈ మేరకు విజయనగరం జీఆర్పీ ఎస్సై బాలాజీరావు, ఆర్పీఎఫ్ సీఐ కుమార్, ఎస్సై శ్రీధర్లతో పాటు 30 మంది సిబ్బంది ఉదయం 10గంటల నుంచి ఒంటిగంట వరకు రైల్వేస్టేషన్లో గంజాయి అక్రమ రవాణా, ఇతర మత్తుపదార్థాల రవాణాను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. మూడు బృందాలుగా ఏర్పడి విజయనగరం రైల్వే స్టేషన్లోని అన్ని విశ్రాంతి గదులతో పాటు క్లాక్ రూమ్లు, పార్సిల్ ఆఫీస్ వద్ద సోదాలు నిర్వహించారు. అలాగే స్టేషన్లో ఉన్న 5 ఫ్లాట్ఫారాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. స్టేషన్కు వచ్చిన భువనేశ్వర్–బెంగళూరు వందేభారత్ ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ బెంగళూరు ప్రశాంతి ఎక్స్ప్రెస్, గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్, సమతా ఎక్స్ప్రెస్ రైళ్లను స్టేషన్ మేనేజర్ ఆదేశాలతో ప్రతి కంపార్టుమెంట్లోనూ సోదాలు చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో ఏ విధమైన మత్తుపదార్థాలు కానీ, గంజాయి సరఫరా కానీ జరగలేదని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపారు. ఈ తనిఖీల్లో పీసీలు రామకృష్ణ, సత్యనారాయణ, నారాయణలతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.