వైఎస్సార్ హయాంలో ప్రభుత్వ అండతోనే కళలకు పునర్జీవం
డీఎస్సీ ద్వారా అన్ని జిల్లాల్లో సంగీత ఉపాధ్యాయ పోస్టుల భర్తీ
చంద్రబాబు పాలనలో ఆ దిశగా కనీస చర్యలూ కరువు
యడ్లపాడు: సమాజ నిర్మాణంలో విద్య ఎంత ముఖ్యమో, వ్యక్తిత్వ వికాసంలో కళలు అంతే కీలకం. ఈ దూరదృష్టితో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2008 డీఎస్సీ ద్వారా ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సంగీత ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సంగీత విద్యకు బలమైన పునాది వేశారు. ఆ నిర్ణయం వేలాది మంది విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించడంతో పాటు సంగీత ఉపాధ్యాయులకు ఉపాధి కల్పించింది. శాసీ్త్రయ కళలకు ఆయన అందించిన రాజపోషణ సంగీత విద్యకు స్వర్ణయుగంగా నిలిచింది. అనంతరం పోస్టుల భర్తీ లేకపోవడంతో సంగీత విద్య నిర్లక్ష్యానికి గురై, కళాకారులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడింది.
వలస వెళ్లాల్సిన దుస్థితి
తెలుగు నేల త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు, అన్నమాచార్య వంటి మహనీయుల సంగీత వారసత్వానికి నిలయం. కూచిపూడి, కర్ణాటక సంగీత సంప్రదాయాలు ఈ నేల గర్వకారణాలు. నాట్యశాస్త్ర పితమహుడు కొండవీటిరాజు కుమారగిరిరెడ్డి, శార్గదేవుడు వంటి మహనీయులు ఈ గడ్డకు చిరస్థాయి కీర్తిని తెచ్చిపెట్టారు. అయితే నేడు కళాకారులకు తగిన ప్రోత్సాహం లేక పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన నాదస్వర విద్వాంసుడు కలైమామణి చిన పీరు సాహెబ్ కుటుంబం వంటి వారు తమిళనాడుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కళాకారులకు ప్రత్యేక ప్రోత్సాహం లభిస్తుండగా, మన రాష్ట్రంలో ప్రణాళికాబద్ధమైన విధానాల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. డిజిటల్ యుగంలో సాంకేతికత పెరిగినా మానసిక ఒత్తిడి, వ్యసనాలు పెరుగుతున్నాయి. సంగీతం, నాట్యం వంటి కళలు క్రమశిక్షణ, సహనం, సృజనాత్మకత, మానవీయ విలువలను పెంపొందిస్తాయి. అందుకే కళలను జీవన విద్యగా చూడాలి. ప్రభుత్వం డీఎస్సీల్లో సంగీత ఉపాధ్యాయ పోస్టులను క్రమం తప్పకుండా భర్తీ చేయాలి. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో సంగీత విద్యను బలోపేతం చేయడంతో పాటు జిల్లా స్థాయిలో సంగీత, నాట్య అకాడమీలు, యువ కళాకారులకు ప్రోత్సాహక పథకాలు అమలు చేయాలి. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, కళా సంస్థలు, సమాజం కలిసి సంప్రదాయ కళల పరిరక్షణకు కృషి చేయాలి.


