ముగిసిన ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు
మంగళగిరి టౌన్ : తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఈనెల21వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు గురువారంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్స్వామి స్వీయ పర్యవేక్షణలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి, శ్రీ భూనీళా సమేత వైకుంఠనాథ్ పెరుమాళ్, శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారు, శ్రీ యోగాంజేయ స్వామివార్ల ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయని పేర్కొన్నారు. గురువారం ఉదయం మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, ప్రథమారాధన, మంగళాశాసనం, ఋత్విక్ సమ్మానం, ఆశీర్వచనం, తీర్థప్రసాద గోష్టి కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి, స్వామివారి మంగళాశాసనాలు అందుకున్నారని పేర్కొన్నారు.


