విద్యాశాఖ ఏకపక్ష విచారణపై నిరసన
నరసరావుపేట ఈస్ట్: పట్టణంలోని ప్రకాష్నగర్లోని ఆక్స్ఫర్డ్ పాఠశాల 10వ తరగతి విద్యార్థినిపై పాఠశాల ప్రిన్సిపాల్ దాడి చేసిన ఘటనపై విద్యాశాఖ ఏకపక్షంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వటాన్ని నిరసిస్తూ విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు గురువారం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. కేవలం పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడిన విచారణాధికారి (డిప్యూటీ డీఈఓ) బాధితురాలిని జరిగిన ఘటనపై వివరాలు అడగకుండానే నివేదిక ఏలా సమర్పిస్తారని ధ్వజమెత్తారు. నివేదికలో ఇచ్చిన ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అని రాశారనీ, అసలు సదరు నెంబరు ఎవరిచ్చారని ప్రశ్నించారు. తాము విడతల వారీగా ఫీజులు చెల్లిస్తున్నా అసలు ఫీజులే చెల్లించటం లేదని యాజమాన్యం చెప్పటం సరికాదన్నారు. తమ కుమార్తైపె జరిగిన దాడిని ప్రశ్నిస్తే పోలీసులను పిలిపించి బెదిరించారని ఆరోపించారు. కేవలం డబ్బు, పలుకుబడి ఉందని తమను ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్యాలయం వద్ద ఆందోళన సమాచారం అందుకున్న డీఈఓ పివిజే రామారావు అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. ఘటన జరిగిన విషయం తెలుసుకొని ఎంఈఓను విచారణకు పంపామనీ, అయితే ఎవరూ అందుబాటులో లేకపోవటంతో మరుసటి రోజు డిప్యూటీ డిఈఓను విచారణకు పంపామన్నారు. ప్రస్తుతం ఇచ్చిన నివేదిక కేవలం ప్రాథమిక నివేదిక మాత్రమేనని పూర్తిస్థాయిలో విచారించి సమగ్ర నివేదిక అందిస్తామన్నారు. ఈసందర్భంగా బాధిత విద్యార్థిని, తల్లిదండ్రులతో తన ఛాంబర్లో వ్యక్తిగతంగా విచారణ చేపట్టారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారించి సమగ్ర నివేదిక రూపొందిస్తామని డిఈఓ రామారావు స్పష్టం చేసారు.
ఆక్స్ఫర్డ్ ఘటనపై డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా
విద్యాశాఖ ఏకపక్ష విచారణపై నిరసన


