ఇంటర్ పరీక్షలు ప్రారంభం
పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ కృతికా శుక్లా 17,248 మంది విద్యార్థులకు 16,345 మంది హాజరు మరో 803 మంది గైర్హాజరు సెట్–1 పేపర్తో పరీక్ష నిర్వహణ తెలుగులో 3, ఉర్దూలో ఒకటి సవరణ సతైనపల్లిలో హాజరైన విద్యార్థుల ఓఎంఆర్ షీట్పై ఆబ్సెంట్ నమోదు పొరపాటు గుర్తించి బఫర్ ఓఎంఆర్ షీట్ అందచేసిన అధికారులు
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు లాంగ్వేజ్ (తెలుగు, సంస్కృతం, ఉర్దూ) పరీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 49 పరీక్ష కేంద్రాల్లో 17,248 మంది విద్యార్థులకుగాను 16,345 మంది హాజరయ్యారు. మరో 803 మంది గైర్హాజరైనట్టు అధికారులు ప్రకటించారు. తొలిరోజు కావటంతో విద్యార్థుల వెంట తల్లిదండ్రులు పరీక్ష కేంద్రాలకు చేరుకొని తమ పిల్లలను జాగ్రత్తగా పంపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పట్టణంలోని కేబీఆర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రా సేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పరీక్షల కమిటీ ప్రతినిధులను ఆదేశించారు. జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి ఎం.నీలావతిదేవి, డీఈసీ అధికారులు పాల్గొన్నారు. సత్తెనపల్లిలోని ప్రైవేటు కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ పొరపాటు కారణంగా ఇద్దరు విద్యార్థులు బఫర్ ఓఎంఆర్ షీట్లో తమ వివరాలు నమోదు చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. సెట్–1 తెలుగు ప్రశ్నపత్రంలో మూడు, ఉర్దూ ప్రశ్న పత్రంలో ఒక సవరణను విద్యార్థులకు తెలియచేశారు.
విద్యార్థులకు నష్టం వాటిల్లదు
బఫర్ ఓఎంఆర్ షీట్ను ఉపయోగించటం ద్వారా విద్యార్థులకు ఎటువంటి నష్టం వాటిల్లదని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి తెలిపారు. తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని కోరారు. విద్యార్థుల ప్రయోజనాలకు ఎటువంటి భంగం వాటిల్లదని స్పష్టం చేశారు.
ఇంటర్ పరీక్షలు ప్రారంభం


