ప్రజలను ఏమార్చేందుకే లడ్డూపై చంద్రబాబు దుష్ప్రచారం
వైఎస్సార్ సీపీ టాస్క్ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్బాబు జిల్లాలో సంస్థాగత పార్టీ నిర్మాణం భేష్
నరసరావుపేట: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను ఏమార్చేందుకు టీటీడీ లడ్డూ ప్రసాదంపై దుష్పచారం చేస్తూ దొడ్డిదారి రాజకీయాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ టాక్స్ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు పేర్కొన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి చర్చించేందుకు వచ్చిన ఆయన సోమవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
చంద్రబాబు పల్నాడు జిల్లాకు వచ్చిన వెంటనే మందా సాల్మన్ మరణం, వినుకొండలో రషీద్ హత్య గుర్తుకు రాకపోవడం విచారకరమన్నారు. వీరి మరణాలకు చంద్రబాబు పశ్చాతాపం ప్రకటించి ఉంటే సభ్యసమాజం హర్షించి ఉండేదన్నారు. సమాజంలోని దళిత నాయకులు అందరూ సాల్మన్ కుటుంబానికి న్యాయం అడిగితే ఇప్పటివరకు ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదని అన్నారు.
మోసపు మాటలతో ఎన్నాళ్లు పరిపాలన: డాక్టర్ గోపిరెడ్డి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను మోసపు మాటలతో తన పరిపాలనా కాలాన్ని వెళ్ల బుచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అన్నారు. వినుకొండ పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు కోటప్పకొండ తిరునాళ్లు తన ఆధ్వర్యంలోనే జరిగాయని చెప్పుకోవటం ఆయన వక్రభాష్యానికి అద్దంపడుతుందన్నారు. తిరునాళ్లలో ఎన్నడూలేని విధంగా మద్యం నేరుగా టేబుళ్లు వేసి విక్రయించారని, దీనిని మానిటర్ చేశారా అని ప్రశ్నించారు. విప్పర్ల గ్రామంలో క్యాసినో ఆడించారని, పేకాట, జిగ్గు ఆటలు, కోడిపందేల కోసం హైదరాబాదు నుంచి 300 కార్లలో జనాలు వచ్చారన్నారు. వాస్తవానికి తిరునాళ్లు అట్టర్ ప్లాప్ అయ్యాయని, అన్నీ రంగాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. కౌన్సిల్ సమావేశంలో వైఎస్సార్ సీపీ వారు బూట్లు వేసుకొని వెంకటేశ్వర స్వామి పటం పట్టుకున్నారని టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. వాస్తవానికి పేపర్లపై ముద్రించిన స్వామి చిత్రాలను మాత్రమే పట్టుకున్నారన్నారు. గతంలో అనేక మార్లు బూట్లు వేసుకొని వెంకటేశ్వరస్వామి ఫొటో పట్టుకొని ఘోర అపచారాలు చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్లకు చెందిన చిత్రాలను ట్యాబ్ ద్వారా విలేకర్లకు చూపించారు. టాస్క్ఫోర్స్ నాయకులు వీరారెడ్డి, పట్టణ అధ్యక్షులు షేక్ కరిముల్లా, నాయకులు అచ్చి శివకోటి, రొంపిచర్ల మండల ఉపాధ్యక్షులు పచ్చవ రవీంద్రబాబు పాల్గొన్నారు.


