క్రిమినల్ కేసుల విచారణ వేగవంతం చేయాలి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : జిల్లాలోని పోలీస్స్టేషన్లలో నమోదైన క్రిమినల్ కేసుల విచారణ వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గడువు లోపు చార్జిషీట్లు న్యాయస్థానంలో దాఖలు చేయాలని ఆదేశించారు. విచారణలో ఎటువంటి ఆలస్యం జరగకుండా సంబంధిత డీఎస్పీలు, సీఐలు, విచారణ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గుర్తుతెలియని నేరస్తుల కేసులను తగ్గించేందుకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహించాలని అన్నారు. నమోదైన అన్ని కేసులలో ఈ– సాక్ష్య గుర్తింపు సంఖ్యలు సృష్టించాలని చెప్పారు. దాతలు, దుకాణ యజమానులు, ప్రముఖుల సహకారంతో మారుమూల ప్రాంతాల్లోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని అన్నారు. నేర ప్రభావిత ప్రాంతాల్లో రాత్రి బీట్లు బలోపేతం చేయాలన్నారు. రౌడీషీటర్లపై బైండోవర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని చెప్పారు.


