వైఎస్సార్ పేరును పునరుద్ధరించాలి
ఏఎన్యూ (పెదకాకాని): ఏఎన్యూలోని ఇంజినీరింగ్ కళాశాలకు మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు తొలగించడం అన్యాయమని, తక్షణమే వైఎస్సార్ పేరును పునరుద్ధరించాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గురువారం ఇంజినీరింగ్ కళాశాలపై ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును తొలగించిన సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నాయకులు వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు, రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలంలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎ. రవిచంద్ర మాట్లాడుతూ... ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలకు 2009 లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టారన్నారు. అప్పటి వీసీ హరగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో 11 మందితో కమిటీ వేశారన్నారు. యూనివర్సిటీ పాలకమండలి సమావేశంలో, అకడమిక్ సెనెట్లోనూ ఏకగ్రీవ తీర్మానం చేసి ఇంజినీరింగ్ కాలేజీకి వైఎస్సార్ పేరు పెట్టారని గుర్తు చేశారు. పాలకమండలి తీర్మానం లేకుండా ఆ పేరు ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి వైఎస్సార్ పేరు తొలిగించాలని చెప్పిందని వీసీ, రిజిస్ట్రార్ లు ఇరువురూ అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్ పేరుంటే వెబ్ ఆప్షన్స్లో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారని ఉన్నతాధికారులు చెప్పడం వింతగా ఉందన్నారు. కళాశాల కోడ్, లాండ్ మార్క్ రెండూ ఉంటాయని వీసీని ప్రశ్నించారు. పదేహేనేళ్లుగా లేని ఇబ్బంది ఇప్పుడు ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. టీఎన్ఎస్ఎఫ్ నేతలు వినతి పత్రం ఇవ్వగానే వైఎస్సార్ పేరు ఎందుకు తొలిగించారన్నా రు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలలకు అనుమతులు ఇవ్వడంతోపాటు ఆయన స్వహస్తాలతో ప్రారంభించడంతో పాటు వాటి అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందజేశారని గుర్తు చేశారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ అరాచక పాలన చివరికి యూనివర్సిటీల్లో కూడా యథేచ్ఛగా కొనసాగుతోందని విమర్శించారు. వైఎస్సార్ పేరు ఇంజినీరింగ్ కాలేజీతోపాటు విద్యార్థులకు ఇచ్చే రీసెర్చ్ ఫెలోషిప్కి కూడా వైఎస్సార్ పేరు పెట్టారని గుర్తు చేశారు. తొలగించిన పేరుని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తా మని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఏఎన్యూ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ పంతగాని రమేష్, యూనివర్సిటీ అధ్యక్షులు ఆసిఫ్ ఖాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివారెడ్డి, నాయకులు భాను కిరణ్, చందు, శ్రీనివాస్, అరుణ్, మదన్ తదితరులు పాల్గొన్నారు.
ఏఎన్యూ వీసీకి వైఎస్సార్
విద్యార్థి విభాగం వినతిపత్రం


