అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతిలో వేంచేసియున్న బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం పూర్ణాహుతితో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ మాట్లాడుతూ రథోత్సవం పూర్తయిన స్వామి వారికి చూర్ణోత్సవం, వసంతోత్సవం నిర్వహించిన అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంతో పంచాహ్నిక దీక్షా బ్రహ్మోత్సవాలు ముగిశాయన్నారు. అలాగే రాత్రి 10 గంటలకు నిర్వహించే ధ్వజావరోహణ కార్యక్రమంతో గురువారం నుంచి స్వామివారి ఏకాంతసేవ మహోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు వసంతోత్సవం అనంతరం స్వామివారిని పల్లకీలో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
వైభవంగా అనంత భోగేశ్వర స్వామి తిరునాళ్ల
కొల్లూరు : మహా శివరాత్రి వేడుకలలో భాగంగా కొల్లూరు అనంత భోగేశ్వర స్వామికి భక్తులు నీరాజనాలు పలికారు. అమావాస్యను పురస్కరించుకొని మంగళవారం రాత్రి పార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామి తిరునాళ్ల మహోత్సవం నిర్వహించారు. భక్తులు దైవ దర్శనం చేసుకొని పూజా కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, దేవదాయ శాఖాధికారులు పర్యవేక్షణలో వేద పంతులు అనంత భోగేశ్వర స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన దేవతామూర్తులు ఉత్సవ విగ్రహాలతో మేళతాళాల నడుమ నిర్వహించిన రథోత్సవానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్ఐ పి.ఏడు కొండలు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ దొడ్డపనేని రమేష్ రథోత్సవంలో పాల్గొన్నారు.
దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి బుధవారం పలువురు భక్తులు విరాళాలను అందచేశారు. గుంటూరు జిల్లా గోరంట్లకు చెందిన కొండూరు కృష్ణమూర్తి, ఉమామహేశ్వరి అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.1,00,001 విరాళం ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందించారు.
బగళాముఖి ఆలయంలో అమావాస్య హోమాలు
చందోలు(కర్లపాలెం): చందోలులోని బగళాముఖి అమ్మవారి ఆలయంలో మంగళవారం రాత్రి 85వ అమావాస్య హోమాలు, విశేష పూజలు రుత్వికుల ఆధ్వర్యంలో జరిగాయి. ఎన్టీఆర్ జిల్లా రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ దంపతులు పాల్గొని పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జరిగిన హోమం, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాపట్ల జిల్లా రిజిస్ట్రార్ శైలజ, ఆలయ కమిటీ చైర్మన్ చక్రధర్రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.


