యంత్రాంగం విఫలం
కోటప్పకొండ తిరునాళ్లలో
నరసరావుపేట: కోటప్పకొండ తిరునాళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంత ఘోర వైఫల్యం ఈ ఏడాది కనిపించిందని వైఎస్సార్సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ జామ్ కాకుండా లింక్ రోడ్లు బాగు చేయాలని సూచించినా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదని విమర్శించారు. ఘాట్రోడ్డుకు కిలోమీటర్ అవతల ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేయడంతో 80 వేల మంది ఇబ్బంది పడ్డారన్నారు. వారికి తాగునీళ్లు కూడా లేవన్నారు. మెట్ల మార్గంలో రద్దీ వల్ల ఓ పాప ఊపిరాడని స్థితికి వెళ్లడం బాధాకరమన్నారు. కొండ వద్ద ప్రైవేట్ స్థలంలో ఎమ్మెల్యే, అనుచరులకు ఏం పనని ప్రశ్నించారు. చిరు వ్యాపారాల వద్ద రూ. వేయి నుంచి రూ.2 వేలను మూడు గ్రూపులుగా వసూలు చేయడం తగదన్నారు. మద్యం ఏరులై పారిందని, చివరకు హోంగార్డు కూడా అమ్మటం దారుణమన్నారు. ఇది ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందని, ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో క్యాసినో నిర్వహించారన్నారు. కోటప్పకొండ ఆలయానికి కమిటీ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. రూ.1.90 కోట్ల కానుకల ఆదాయాన్ని కొండ అభివృద్ధికి ఖర్చు చేయాలని సూచించారు. ఈఓ కాంట్రాక్టర్ అవతారం ఎత్తి రూ.లక్షలు చేతులు మారుస్తున్నారని, దీంట్లో ఎమ్మెల్యేకి కూడా వాటాలు ఇస్తూ కాంట్రాక్టు పనులను చేస్తున్నారని ఆరోపించారు. భక్తులకు ఉచితంగా ఇవ్వడానికి 1.25 లక్షల లడ్డూలు తయారు చేశారని, 30 వేల మందికి మాత్రమే పంపిణీ చేశారన్నారు. ప్రకాశం జిల్లా యువకుడు కాలువలో కొట్టుకుపోతుంటే భద్రతా దళాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. గోనెపూడి నుంచి కొండకు వచ్చిన వైఎస్సార్సీపీ అభిమానుల ప్రభ దగ్గర ప్రజలు, పార్టీ అభిమానులు ఉండకూడదని ఉద్దేశంతో రూరల్ ఎస్ఐ లాఠీచార్జి చేశారని, అధికారంలోకి వచ్చాక చర్యలు తప్పవని పేర్కొన్నారు.
మద్యం అమ్మకాలు, చిరు వ్యాపారుల
వద్ద మామూళ్ల దందా
క్యాసినో ఏర్పాటుతో రూ.కోట్లు
ఆర్జించిన కూటమి నాయకులు
వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా వర్కింగ్
ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి


