వైద్యులు నిరంతర విద్యార్థులు
మంగళగిరి టౌన్: వైద్య విద్యార్థులకు అధికారికంగా విద్యాకాలం ముగిసినప్పటికీ వారు నిరంతరం విద్యార్థులేనని, జీవితాంతం వైద్యంలో నేర్చుకోవాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. గుంటూరు జిల్లా, మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) రెండవ స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ మాట్లాడుతూ యువ వైద్యులది కీలకపాత్ర అని, చిత్తశుద్ధితో పనిచేసి దేశ ఆరోగ్యాభివృద్ధిలో పాలుపంచుకోవాలని సూచించారు.
ప్రజల ప్రాణాలు కాపాడి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అమూల్య అవకాశం వైద్యులకే ఉందని తెలిపారు. రాష్ట్ర ౖవిద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ జీవితానికి, మరణానికి మధ్య నిలబడి ప్రాణదాతలుగా సేవలు అందించడం వల్లే సమాజంలో వైద్యులకు గౌరవం లభిస్తోందని పేర్కొన్నారు. ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఈఓ ప్రొఫెసర్ డాక్టర్ అహంతెం శాంతాసింగ్ మాట్లాడుతూ వైద్యవిధానంలో ప్రభావవంతమైన కమ్యూనికేషన్ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం వైద్యవిద్యను పూర్తిచేసుకున్న 49మంది వైద్య విద్యార్థులకు, పోస్ట్గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్న ఐదుగురు విద్యార్థులకు, పోస్ట్ డాక్టోరల్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసుకున్న నలుగురు విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. మంగళగిరి ఎయిమ్స్ అధ్యక్షుడు మేజర్ జనరల్ డాక్టర్ తపన్కుమార్ సాహా, విశిష్ట అధ్యాపక సభ్యులు, పట్టభద్రులైన వైద్యులు, నర్సులు, ఆరోగ్య సంరక్షకులు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
సహాయ మంత్రి అనుప్రియ పటేల్


