త్రికోటేశ్వరుని ఆదాయం రూ.1.95 కోట్లు
నరసరావుపేట రూరల్: మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ దేవస్ధానానికి రూ.1,95,81,848లు ఆదాయం లభించింది. ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. హుండీల ద్వారా రూ.75, 52,700లు, పూజా టికెట్లు విక్రయం ద్వారా రూ.77,78,318లు, ప్రసాదాల అమ్మకాల ద్వారా రూ.41,30,725లు ఆదాయం వచ్చింది. వీటితో పాటు 3.55 గ్రాముల బంగారం, 278.300 గ్రాముల వెండీ, 13 అమెరికన్ డాలర్లు హుండీలో లభించాయి. తిరునాళ్ల ఉత్సవ అధికారి కె.బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త రామకృష్ణ కొండలరావు, గుంటూరు సహయ కమిషనర్ శ్రీనివాసరావు, ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావులు పర్యవేక్షించారు.
ఆర్టీసీ ఆదాయం రూ.82 లక్షలు
నరసరావుపేట: మహాశివరాత్రి సందర్భంగా స్థానిక ఆర్టీసీ డిపో నుంచి కోటప్పకొండపై వరకు తిరిగిన బస్సుల ద్వారా రూ.82లక్షల ఆదాయం లభించినట్లు డిపో మేనేజర్ బూదాటి శ్రీనివాసరావు సోమవారం రాత్రి పేర్కొన్నారు. గతేడాది రూ.70లక్షలు వచ్చాయన్నారు. కాగా, జిల్లా వ్యాప్తంగా కొండకు తిరిగిన బస్సుల ద్వారా వచ్చిన ఆదాయ వివరాలు మంగళవారం తెలియచేస్తామని ఆర్ఎం టి.అజితకుమారి పేర్కొన్నారు.
సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద వేంచేసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబా సమేత మల్లిఖార్జున స్వామి దేవస్థానం నందు మహా శివరాత్రి సందర్భంగా ఈ ఏడాది రూ. 5,10,081 ఆదాయం వచ్చినట్లు సత్తెనపల్లి దేవదాయశాఖ ఇన్స్పెక్టర్, మహాశివరాత్రి ప్రత్యేక అధికారి వి.లీలావతి సోమవారం తెలిపారు. టికెట్లు ద్వారా రూ.1,01,010, హుండీ కానుకల ద్వారా రూ. 2,31,712, చదివింపులు రూ.56,485, విరాళాలు రూ. 18,500, కల్యాణం దంపతుల ద్వారా రూ. 2,064, తలనీలాలు ద్వారా రూ. 310 మొత్తం రూ. 5,10,081 ఆదాయం వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఈవో గాదె రామిరెడ్డి, చైర్మన్ గుండా వెంకట శివయ్య, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలోని శ్రీ పానకాల లక్ష్మీ నృసింహస్వామి కొండపై పర్యావరణ పరిరక్షణకై ఆలయ అధికారులు సోమవారం చర్యలు చేపట్టారు. 17వ తేదీ మంగళవారం అమావాస్యను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్ధం ఘాట్రోడ్ ద్వారా గండదీపానికి వెళ్లే మార్గంలో వాహనాలను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.సునీల్ కుమార్ తెలిపారు. కొండపై ప్లాస్టిక్ వినియోగం నియంత్రణలో భాగంగా ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు తదితర వస్తువులను గండాలయ స్వామి ఆలయ ప్రాంతంలో నిషేధించామని పేర్కొన్నారు. స్వామి వారి దర్శనార్ధం వచ్చే భక్తులు శ్రీ గండాలయస్వామి వారి సన్నిధికి ప్లాస్టిక్ సామగ్రిని తీసుకురావద్దని ఆయన కోరారు. ఆలయ పరిశుభ్రతను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
చేబ్రోలు: మండలంలోని వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానానికి తిరునాళ్ల సందర్భంగా హుండీ ఆదాయం గత ఏడాది కన్నా ఈ ఏడాది గణనీయంగా పెరిగినట్లు దేవదాయశాఖాధికారులు తెలిపారు. వడ్లమూడి క్వారీ దేవస్థానం వద్ద సోమవారం దేవదాయశాఖాధికారులు హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. భక్తులు హుండీలో వేసిన కానుకలను, ఇతర ఆదాయాలను దేవదాయశాఖాధికారులు, స్థానిక పెద్దల సమక్షంలో లెక్కింపు నిర్వహించారు. మొత్తం రూ.17.30లక్షలు ఆదాయం వచ్చినట్లు దేవదాయశాఖాధికారి నరసింహారావు తెలిపారు. వీటిలో హుండీల ఆదాయం రూ.6,03, 208 లు, అభిషేకం, ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.7,40,500లు, కొబ్బరి చిప్పలు, కొబ్బరికాయలకు రూ.2.95లక్షలు, గ్యాస్ పొయ్యిలకు రూ.34,500లు, డొనేషన్స్ రూ. 57,390ల ఆదాయం సమకూరినట్లు తెలి పారు. దేవస్థానానికి మొత్తంగా రూ. 17.30లక్షలు సమకూరింది. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం రూ.1.03 లక్షలు అదనంగా ఆదాయం వచ్చినట్లు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అధికారులు అంచనా వేశారు. దేవదాయ శాఖాధికారులు, పోలీసు, రెవెన్యూ శాఖాధికారులు, గ్రామస్తులు, స్థానిక పెద్దలు, సిబ్బంది పాల్గొన్నారు.
త్రికోటేశ్వరుని ఆదాయం రూ.1.95 కోట్లు


