మొక్కజొన్నకు నీరివ్వాలంటూ ఆందోళన
నరసరావుపేట: పొట్టదశలో ఉన్న మొక్కజొన్న పొలాలకు సరిపడా సాగునీరు ఇవ్వాలని కోరుతూ మొక్కజొన్న రైతులు సోమవారం ఎన్ఎస్పీ డీఈ కార్యాలయం, కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు. నరసరావుపేట మండలంలోని కేఎం అగ్రహారం, ఇసప్పాలెం, తురకపాలెం, వల్లప్పచెరువు కిందనున్న పొలాల రైతులు సుమారు 1500 ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. ఆ పంటకు నీరు అందక ఆందోళన చెందుతూ ఎన్ఎస్పీ అధికారులకు తమ సమస్య తెలియచేశారు. తామంతా ఎకరానికి రూ.40వేలు వరకు పెట్టుబడి పెట్టామని, ఈ దశలో నీరు పెట్టకపోతే రూ.5వేలు కూడా రావని ఆందోళన వ్యక్తం చేశారు. వారందరూ ఎన్ఎస్పీ డీఈని కలిసి తమ సమస్యను విన్నవించారు. తమకు మార్చి నెలాఖరు వరకు నీరిస్తే సమస్య తీరుతుందని, నీరిచ్చి ఆదుకోవాలని అధికారులను కోరారు. అనంతరం కలెక్టరేట్ ముందు ఆందోళన చేసి పీజీఆర్ఎస్లో అధికారులకు వినతిపత్రం అందజేసి తమ సమస్య చెప్పుకున్నారు.
ఎన్ఎస్పీ డీఈ కార్యాలయం, కలెక్టరేట్ ముందు రైతుల నిరసన


