
ఘనంగా భూ వరాహ స్వామి జయంతి వేడుకలు
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై భూ వరాహస్వామి జయంతి వేడుకలు రెండో రోజైన గురువారం వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆశ్రమ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళా శాసనాలతో భూ వరాహస్వామి జయంతి మహోత్సవాల్లో భాగంగా ఉదయం 10 గంటలకు కల్యాణ మహోత్సవం నిర్వహించామని తెలిపారు. వివాహ యోగ్యత, దాంపత్యాభివృద్ధి, మంచి సంతానం పొందుటకు ఈ కల్యాణ మహోత్సవం దోహదపడుతుందని తెలిపారు. కల్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు.
పీజీ కోర్సుల
ఫలితాలు విడుదల
పెదకాకాని: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్ జరిగిన పలు పీజీ కోర్సుల 4వ సెమిస్టర్ ఫలితాలను సీఈ ఆలపాటి శివప్రసాదరావు గురువారం విడుదల చేశారు. సోషల్ వర్క్ 16కి 16మంది, ఎంఏ అప్లయిడ్ లింగ్వి ట్రానన్స్లేషన్ స్టడీస్లో 10కి 10మంది, మాస్టర్ ఆఫ్ ఒకేషనల్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్ కోర్సులో 21కి 18 మంది, మాస్టర్ ఆఫ్ ఒకేషనల్ హార్టీకల్చర్ అండ్ ల్యాండ్ స్కేపింగ్లో 16 మందికి 11మంది ఉత్తీర్ణత సాధించారు. రీవాల్యుయేషన్కు దరఖాస్తులను 18లోగా ఒక్కొక్క పేవరుకు రూ.1860, పర్సనల్ వెరిఫికేషన్కు రూ.2190 చెల్లించాలని ఆయన సూచించారు.
9,10 తేదీల్లో రాష్ట్ర స్థాయి జూడో పోటీలు
గుంటూరు వెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 9, 10 తేదీల్లో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల బాలికల జూడో చాంపియన్షిప్ 2025–26 పోటీలు నిర్వహిస్తామని అసోసియేషన్ అధ్యక్షులు అప్పికట్ల శ్రీహరినాయుడు తెలిపారు. గురువారం స్థానిక జేకేసి కళాశాల రోడ్డులో పోటీలకు సంబంధించిన పోస్టర్ను తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్కుమార్, శ్రీహరి నాయుడు, గుంటూరు జిల్లా జూడో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కిరణ్కుమార్రెడ్డి, పల్నాడు జూడో అసోసియేషన్ అధ్యక్షులు పసుపులేటి వెంకటేశ్వరరావులు ఆవిష్కరించారు. శ్రీహరి నాయుడు మాట్లాడుతూ పెదపరిమిలోని మువ్వా చిన్న బాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ప్రాంగణంలో నిర్వహిస్తామన్నారు.
సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్
నరసరావుపేటటౌన్: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 13వ తేదీ జాతీయ లోక్ అదాలత్ నిర్వహస్తున్నట్లు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.సత్యశ్రీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదాలత్లో రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులతో పాటు సివిల్ కేసులు పరిష్కరించబడతాయన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని కోరారు.
వెలుగులోకి
రేషను డీలర్ మోసం
తాడికొండ: గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘అధికారమే అండగా డీలర్ల దందా’ కథనంతో అధికారులు తర్జనభర్జన పడ్డారు. ఎట్టకేలకు నింద తమపై వేసుకోకుండా హడావుడిగా ఆర్డీవో జారీ చేసిన సిఫార్సు లేఖను వెలుగులోకి తీసుకొచ్చి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేశారు. ఒకే డీలరుకు రెండో పాయింట్ కేటాయించేందుకు చెప్పిన కారణాలు చూసి సాటి డీలర్లే ముక్కున వేలేసుకుంటున్నారు. అర కిలోమీటరు లేని దూరానికి ఒకటిన్నర కిలోమీటరుగా చూపిస్తూ రెండో పాయింట్ ఏర్పాటుకు అనుమతులిచ్చారు. కాలనీకి కేవలం 200 మీటర్లలోపు దూరంలో ఉన్న డీలరును పాడుబడిన భవనంలోకి వెళితేనే సరుకు కేటాయిస్తామంటూ దబాయించి తరిమేయడం మరో అంశం. ఆ పాయింట్ ఏ ఇంటివద్ద నిర్వహించాలి అనే డోర్ నంబర్ లేదా ఇతర అడ్రస్సు ఏమీ పొందుపరచకపోవడం చూస్తుంటే సదరు డీలరుపై ఎంత ప్రేమో అర్థం అవుతోంది.