రాయగడ: కేంద్రంలో బీజేపీ పాలనకు 12 ఏళ్లు, రాష్ట్రంలో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక తేజస్వీని హోటల్లో మేధావుల సదస్సు, చర్చాగోష్టిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపీ ఆనంద్ మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన మేధావులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొని అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా నవరంగపూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మాఝి హాజరై ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజాహిత పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, దేశం, రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించారు. సంక్షేమం, మౌలిక వసతుల కల్పన, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం జిల్లాలోని పలు రంగాలకు చెందిన మేధావులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాయగడ సమగ్రాభివృద్ధి, విద్య, వైద్యం, పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, పర్యాటక రంగ ప్రోత్సాహం, రహదారులు, ఇతర మౌలిక వసతుల విస్తరణపై నిర్మాణాత్మక సూచనలు చేశారు. జిల్లా అభివృద్ధికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం గురించి సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు యాళ్ల కొండబాబు, బసంత కుమార్ ఉలక, కోరాడ రజిత, ఎస్డీసీ వైస్ చైర్పర్సన్ మంజులా మినియాక, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ దుస్మంత్ కుమార్ మహంతి, సీనియర్ పాత్రికేయుడు అమూల్య రత్నసాహు, బాదల్ థా, సెంచురియన్ విశ్వవిద్యాలయం ప్రాంతీయ డైరక్టర్ డాక్టర్ రాజేష్ కుమార్ పాడి తదితరులు పాల్గొన్నారు.


