జయపురం: పట్టణ పోలీసులు పేకాటరాయుళ్ల ముఠాను పట్టుకున్నారు. పేకాట శిబిరంపై దాడిచేసి 15 మందిని జూదగాళ్లను అరెస్టు చేసినట్లు జయపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి అర్చిత మిట్టల్ తెలిపారు. ఈ మేరకు జయపురం పట్టణ పోలీసుస్టేషన్ సభాగృహంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణంలోని పారాబెడ, జీరు పటాన్ లైన్లో పెద్ద ఎత్తున పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో వెంటనే పోలీసు టీమ్ ఆ ప్రాంతానికి వెళ్లి దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. దాడి సమయంలో పేకాడుతున్న 15 మందిని పట్టుకున్నామన్నారు. అలాగే రూ.3.50 లక్షల నగదు, 8 ద్విచక్ర వాహనాలు, 15 సెల్ఫోన్లు, 10 సీల్డ్ పేక దస్తాలు, 52 లూజ్ పేక ముక్కలు సీజ్ చేసినట్లు వెల్లడించారు. వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.


