పర్లాకిమిడి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు, నిధుల మంజూరుకు సెన్సస్ అవసరమని, తద్వారా పలు పథకాలకు రూపకల్పన జరుగుతుందని సమగ్ర గిరిజనాభివృద్ధి శాఖ, ప్రాజెక్టు అధికారి అంశుమాన్ మహాపాత్రో అన్నారు. స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో 20వ జాతీయ గణాంకాల దినోత్సవాన్ని ప్రారంభించారు. భారతీయ గణాంకాల పితామహుడు పి.సి.మహాలనోబిస్ జన్మదినం పురస్కరించుకుని జూన్ 29న జాతీయ గణాంకాల దినోత్సవాన్ని జరుపుకుంటారని ఏడీఎం ఫల్గుణి మఝి అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖాలకు వెన్నెముక అయిన గణాంకాలు, ప్రకృతి వైపరీత్యాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, గుడ్ గవర్నెన్స్, ఐ.ఎం.ఎఫ్ నిధులు, నీతి అయోగ్ వంటివి దేశంలో అభివృద్ధి పథంలో నడపాలంటే గణాంకాల నివేదిక సమకూర్చడం అవసరమని ఎస్.కె.సి.జి కళాశాల అసిస్టెంటు ప్రొఫెసర్ డాక్టర్ ప్రియబ్రత శతపతి అన్నారు. స్టాటిస్టిక్స్పై పవర్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్, మానిటరింగ్ యూనిట్ డిప్యూటీ డైరెక్టర్ ప్రకాష్ రౌత్, జిల్లా ముఖ్యవ్యవసాయ అధికారి ఎం.ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. మహిళా కళాశాలలో జాతీయ గణాంకాల దినోత్సవంపై నిర్వహించిన క్విజ్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులను ప్రియబ్రత శతపతి అందజేశారు.


